* మంత్రి పదవి నుంచి బర్తరఫ్...
* రేవంత్ రెడ్డి పట్టుదలతో అధిష్ఠానం సంచలన నిర్ణయం... !
* రాజ్ భవన్ కు లేఖ...
* నా సమస్యలు చెప్పినా పట్టించుకోలేదు... కక్షపూరితంగానే చర్యలు....
* నా కోసం చిన్నారెడ్డిపై వేటు వేశారు : కొండా సురేఖ...
Astranews :
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు అధిష్ఠానం సానుకూలంగా స్పందించింది. మరో సీనియర్ నేత చిన్నారెడ్డి పై కూడా చర్యలు తీసుకుంది. దిల్లీలో జరిగిన కీలక భేటీల అనంతరం ఈ నిర్ణయం వెలువడటంతో తెలంగాణ రాజకీయాలు దిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ముఖ్యనేతల మధ్య వరుసగా జరిగిన భేటీల అనంతరం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలోని ఇందిరా భవన్ తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యనేతల భేటీల కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గంలో క్రమశిక్షణ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, పీసీసీ చీఫ్ నివేదికలను సైతం అధిష్ఠానానికి అందజేశారు.
రేవంత్ రెడ్డి మొండిపట్టు:
క్రమశిక్షణా చర్యలు మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా ఖర్గేతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయి తన వివరణ ఇచ్చుకున్నారు. తనపై పార్టీలో అంతర్గతంగా కుట్ర జరుగుతోందని పేర్కొంటూ ఒక నివేదికను సమర్పించారు. కేసీ వేణుగోపాల్ను కలిసేందుకు ఆమె ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది.
కేవలం మంత్రి కొండా సురేఖపైనే కాకుండా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిపై కూడా చర్యలకు అధిష్ఠానం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొండా సురేఖ తీరు పలుమార్లు వివాదాస్పదమైనా ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చర్యల విషయంలో తగ్గేదేలేదన్నట్లు వ్యవహరించారు.
నా సమస్యలు చెప్పినా పట్టించుకోలేదు... కక్షపూరితంగానే చర్యలు....కొండా సురేఖ.. : హైకమాండ్ నుంచి అధికారికంగా ఆదేశాలు లేదా లేఖ వెలువడిన వెంటనే తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా గవర్నర్కు సిఫార్సు లేఖ పంపాల్సి ఉంటుంది. గురువారం రోజున ఈ ఉత్తర్వులు వెలువడటంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కాయి.
ఇప్పటికే కొండా సురేఖ తన స్వరం మార్చారు. కానీ తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని హెచ్చరించారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి.. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఎలా అంటారని ప్రశ్నించారు. పార్టీలో ఇతరులపై కూడా ఆరోపణలు వచ్చాయని, వారిపైచర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొండా సురేఖ ప్రశ్నించారు. కక్షపూరితంగానే తనపై చర్యలు తీసుకున్నారని, ఉరిశిక్ష అమలు చేసేటప్పుడు కూడా చివరి కోరికను అడుగుతారని, తనను అది కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో మంత్రి కొండా సురేఖ తొలగింపుపై అధికారిక ఉత్తర్వులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త మలుపునకు దారితీయనుంది. సురేఖ వ్యాఖ్యలు, బీసీల ఏకీకరణ హెచ్చరికలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.
నా కోసం చిన్నారెడ్డిపై వేటు వేశారు : కొండా సురేఖ...:
నా మీద చర్యలు తీసుకునేందుకు మరో సీనియర్ నేత చిన్నారెడ్డి పై చర్యలు తీసుకోవడం దారుణమని కొండా సురేఖ కామెంట్స్ చేశారు. నా ఒక్కదానిపై చర్యలు తీసుకోలేక సాకుగా మాత్రమే చిన్నారెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఒకరిపై చర్యలు తీసుకునేందుకు మరొకరిపై చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.