* ఆదాయానికి మించి రూ.5 కోట్ల ఆస్తులు గుర్తింపు..
* నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్న ఎసిబి అధికారులు...
AcB Arrests TTD Deputy Eo :
తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లోకనాథం ఇల్లు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన ఏసీబీ తనిఖీలు ఇవాళ ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించిన ఏసీబీ.. కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేసింది. లోకనాథంను ఇవాళ నెల్లూరు ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపర్చనున్నారు. లోకనాథం ఇంట్లో రూ.5కోట్ల విలువైన ఆస్తులు, 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. లోకనాథంతో పాటుగా ఆయన భార్య, కుమారుడు పేరుతో ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు గుర్తించారు.. అలాగే లోకనాథం తమ్ముడు, భార్య సోదరుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు.
లోకనాథం 1989లో కారుణ్య నియామకం కింద టీటీడీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరగా.. అనంతరం ఆయనకు సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఈవోగా పదోన్నతులు వచ్చాయి. లోకనాథం 2023 ఏప్రిల్ నుంచి తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నారు. అంతకముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ... గతేడాది ఆయన్ను తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి టీటీడీ బదిలీ చేసింది.. కానీ అనివార్య కారణాలతో ఈ బదిలీలలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ప్రస్తుతం ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలో డిప్యూటీ ఈవోగా కొనసాగుతున్నారు.
ఈ నేపధ్యంలోనే టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంపై కల్తీనెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ చిన్నఅప్పన్న విచారణలో తేలిన కొన్ని అంశాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. లోకనాథంపై సెక్షన్ 13(2) r/w 13(1)(b) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. సీబీఐ టీటీడీ లడ్డూ కల్తీ కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ సమయంలో టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగుల ఆస్తుల సమాచారాన్ని సీబీఐ ఏసీబీకి అందించినట్లు తెలుస్తోంది. లోకనాథం సమాచారం కూడా ఏసీబీకి చేరడంతో ఈ సోదాలు చేసినట్లు సమాచారం.
కల్తీ నెయ్యి కేసులో కొంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తులో తేలింది. నేరుగా సంబంధం లేకపోయినా.. కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల సిట్ ఫోకస్ పెట్టింది.. వారి ఆదాయం, ఆస్తుల వివరాలు సేకరించి ఏపీ ప్రభుత్వానికి, ఏసీబీ అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్, ఏసీబీ నివేదికలతో కల్తీ నెయ్యి కేసులో మరికొందరు ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉందని ప్రచారం జరుగతోంది. వాస్తవానికి టీటీడీ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వస్తే.. టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేస్తుంది. ఒకవేళ నేరం రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటుంది. గతంలో పలువురిపై ఇలాగే చర్యలు తీసుకుంది.