* 258 కిలోమీటర్ల దూరం.. 3 గంటల్లోనే చేరేలా నిర్మాణం ..
* అత్యంత ఆధునిక సాంకేతికతతో ఎక్స్ప్రెస్వే పనులు ..
Chennai-Bengaluru Expressway Works very fast :
దక్షిణ భారతదేశంలో శరవేగంగా జరుగుతున్న ఎక్స్ప్రెస్ లలో అత్యంత ప్రతిష్ఠాత్మక జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో చెన్నై-బెంగళూరు ఎక్స్ప్రెస్వే నిర్మాణం ఒకటి. ఈ ప్రాజెక్టు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతుండగా... ఈ ఎక్స్ప్రెస్వే పూర్తయితే బెంగళూరు–చెన్నై మధ్య ప్రస్తుతం 6 నుంచి 7 గంటలు పడుతున్న ప్రయాణ సమయం తక్కువ సమయంలోనే అంటే 3 గంటలకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టు మూడు రాష్ట్రాల మధ్య రవాణా, పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా మారనుంది. మొత్తం 258 కిలోమీటర్ల పొడవుతో కర్ణాటకలోని హోస్కోట నుంచి తమిళనాడులోని పెరంబూర్ వరకు నిర్మిస్తున్న ఈ రహదారి, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తమిళనాడులను అత్యంత వేగవంతమైన మార్గంతో అనుసంధానించనుంది.

ఈ ప్రాజెక్ట్ పూర్తైతే పారిశ్రామిక ప్రాంతాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ ఎక్స్ప్రెస్వే ద్వారా కర్ణాటకలోని హోస్కోట, మాలూరు, బంగారుపేట, బేతమంగళ, కోలార్, నరసాపుర ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు బెంగళూరు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్డుకు అనుసంధానం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె, పలమనేరు (మొగిలి) మీదుగా సుమారు 85 కిలోమీటర్ల మేర కనెక్టివిటీ ఉంది. తమిళనాడులో రాణిపేట, అరక్కోణం, వాలాజాపేట, కాంచీపురం, శ్రీపెరంబదూర్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్లను కలుపుతుంది. దీంతో పరిశ్రమలు, ఎగుమతులు, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త ఊపు లభించడంతో పాటు సరకు రవాణా వేగవంతం కానుంది.
కేంద్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్లు ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. ఇందులో దాదాపు రూ.5 వేల కోట్లు రహదారి కోర్ నిర్మాణ పనులకే వినియోగిస్తుండగా, మిగిలిన నిధులను భూసేకరణ, పరిపాలన, టోల్ వ్యవస్థల ఏర్పాటుకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 71 కిలోమీటర్ల మేర ట్రయల్ రన్కు మార్గాన్ని సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొగిలి ప్రాంతంలో కనెక్టివిటీ పనులు కొనసాగుతుండగా, పలమనేరు అటవీ ప్రాంతంలో అండర్పాస్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 100 కిలోమీటర్ల మేర రహదారి దాదాపుగా అందుబాటులోకి వచ్చింది.
ఈ ప్రాజెక్టు అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్ప్రెస్వే పూర్తిగా సిగ్నల్-ఫ్రీ, యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా రూపుదిద్దుకుంటోంది. రహదారిపై వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎమ్ఎస్) ద్వారా ఏఐ ఆధారిత ట్రాఫిక్ మానిటరింగ్, నిరంతర నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోమేటెడ్ స్మార్ట్ టోలింగ్ వ్యవస్థ వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనాల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో క్రాష్ బారియర్లు, అత్యవసర సేవల బేలు నిర్మిస్తున్నారు. అలాగే అడవి జంతువులు, ఇతర వాహనాలు రహదారిపైకి రాకుండా మొత్తం మార్గం వెంట గ్రిల్స్, రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తం మీద ఈ ప్రాజెక్టు మూడు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చనుండగా... ప్రయాణ సమయాన్ని కూడా సగానికి తగ్గనుంది. తద్వారా ప్రయాణీకులకు కూడా ఎంతో అనుకూలంగా మారనుంది. శరవేగంగా జరుగుతున్న ఈ పనులు పూర్తయైతే త్వరలోనే ఈ రహదారి పూర్తిగా అందుబాటులోకి రానుంది.