*ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం ...
*ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..వైయస్ జగన్
తాడేపల్లి:
స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చించారు.
ప్రజల్లో కూటమిపై తీవ్ర వ్యతిరేకత... :
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని వైయస్ జగన్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ ప్రభుత్వం పూర్తిగా నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను, ప్రస్తుత కూటమి పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారని, ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోందని అన్నారు. అదే సమయంలో వైయస్ఆర్సీపీపై ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకుండా చేసేందుకు పోలీసులను ఉపయోగించే అవకాశం ఉందని వైయస్ జగన్ అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ఎన్నికల యుద్ధంలో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వైయస్ఆర్సీపీకి ప్రజల్లో అత్యంత ఆదరణ ఉందని, అందుకే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలపై ఆందోళన.... :రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయని వైయస్ జగన్ అన్నారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలతో పాటు గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడే స్థాయికి వ్యవస్థలు దిగజారాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా హత్య చేసిన ఘటనపై కూడా ఆయన ప్రస్తావించారు. కారుతో పదేపదే ఢీకొట్టి ఆమె ప్రాణాలు తీశారని, అయినప్పటికీ ఆ ఘటన బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం జరిగిందని అన్నారు. పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారు కుమ్మక్కై వ్యవహరిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వైయస్ జగన్ అన్నారు. రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని, ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్ఆర్సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేస్తూ, స్థానిక స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.