* రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం
* కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర వివాదాలు, పరిధిలో న్యాయ విచారణల కారణంగా...
* పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ DPRను సమగ్ర ప్రణాళిక కోసం తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు వెల్లడి ...
* జాతీయ ప్రాజెక్టు హోదా నిబంధనలు ఉన్నప్పటికీ ...
* PRLISను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అంశం కేంద్ర పరిశీలనలో లేదన్న కేంద్రం ...
DELHI :
తెలంగాణ ప్రాధాన్య నీటిపారుదల ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి రాతపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర జల సంఘానికి (CWC) అందిన DPR ప్రకారంగా ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక పరిశీలనలు (Techno-Economic Appraisal) పూర్తయితేనే కేంద్ర సాయాన్ని పరిశీలించడానికి వీలవుతుందని మంత్రి తెలిపారు. అయితే, ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల వినియోగం మరియు అంతర్రాష్ట్ర అంశాలు ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్–II (KWDT-II) పరిధిలో ఉన్నందున, కేసు న్యాయస్థానం (Sub-judice) ముందుకు చేరిందని వివరించారు. ఈ కారణంగా ప్రస్తుతం PRLISకి సంబంధించిన టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ప్రాజెక్టు ద్వారా ఉద్దేశించిన పూర్తి ప్రయోజనాలు సిద్ధించేలా సమగ్ర ప్రణాళిక (Holistic Planning) తో మళ్లీ రావాలంటూ తెలంగాణ ప్రభుత్వానికే DPRను వెనక్కి పంపినట్లు కేంద్రం తెలిపింది. ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సాయం అందించే విషయంపై కూడా ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. సాధారణంగా జాతీయ ప్రాధాన్యం ఉన్న, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల వివాదాలు ఉన్న, లేదా గణనీయమైన స్థాయిలో సాగునీటి సామర్థ్యాన్ని కల్పించే ప్రాజెక్టులకు PMKSY-AIBP మార్గదర్శకాల ప్రకారం జాతీయ హోదా కల్పిస్తారని కేంద్రం వివరించింది.
ఈ పథకం తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, వికారాబాద్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చడానికి కృష్ణా నదీ జలాలపై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. దీని ద్వారా సుమారు 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని అంచనా. ఉమ్మడి పాలమూరు మరియు రంగారెడ్డి జిల్లాల్లోని ఎండిన భూములకు నీరు అందించడం లక్ష్యం కాగా...కృష్ణా నది నుంచి 90 టీఎంసీల నికర జలాలను తరలించాలన్నది ప్రధాన ఉద్దేశ్యం.
వాస్తవానికి ఈ పథకం మొదటి నుంచి వివాదాస్సాద ప్రాజెక్టే. నీటి కేటాయింపులు, జాతీయ హోదా నిరాకరణ, అంతర్రాష్ట్ర కృష్ణా జలాల వివాదాలు మరియు రాజకీయ విమర్శలతో ముడిపడి ఉంది. కృష్ణా నది నీటి వినియోగంపై స్పష్టత లేకపోవడం, డీపీఆర్ (DPR) వెనక్కి వెళ్లడం వంటి అంశాలు ఈ ప్రాజెక్ట్ వివాదాలకు ప్రధాన కారణం.ఈ కారణంగానే ఇప్పుడు కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర వివాదాలు KWDT-II పరిధిలో న్యాయ విచారణలో ఉండటంతో టెక్నో–ఎకనామిక్ అప్రైజల్ చేపట్టలేమని, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ DPRను సమగ్ర ప్రణాళిక కోసం తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు కేంద్రం వెల్లడించింది.