* అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్కు తావివ్వకుండా...
* ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి..
* గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి
* అక్రమ కేసులు, వేధింపులన్నీ ‘డిజిటల్ డైరీ’ లో నమోదు
* ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
* వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్ మోడ్లోకి రావాలి
* వైసీపీ నాయకులకు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల దిశానిర్దేశం ....
తాడేపల్లి :
సోషల్ మీడియా ద్వారా ప్రతి కార్యకర్తను అర్మీ సైన్యంలా తయారు చేసేందుకు వైసీపీ కసరత్తు మొదలుపెట్టింది. అసభ్య పదజాలం జోలికి వెళ్లకుండా ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను తిప్పికొట్టడమే ధ్యేయంగా పనిచెయ్యాలని కార్యకర్తలకు పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులతో ముఖ్య సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పోస్టు రాజ్యాంగబద్ధంగా, వాస్తవ ఆధారాలతో, మర్యాదపూర్వక భాషలోనే ఉండాలని, అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్కు తావివ్వకూడదని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ–2025లో అక్రమాలపై నిష్పాక్షిక సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా డిమాండ్తో పాటు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీ అమలు, రూ.9,500 కోట్లకు పైగా ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన బకాయిల విడుదలపై తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని నేతలు పిలుపునిచ్చారు. దీనికోసం గ్రామ స్థాయి నుండి ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్లలో అధికారిక ఖాతాలను నిర్వహిస్తూ జన్ జెడ్, జన్ ఆల్ఫా యువత భాగస్వామ్యంతో డిజిటల్ వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించాలని సూచించారు. ప్రజాబలం లేక కేవలం భ్రమలు కల్పించే మీడియా వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగంతో అధికారాన్ని చెలాయిస్తున్న కూటమి ప్రభుత్వంపై పొలిటికల్ అజెండాతో తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పోలీసు వ్యవస్థను వాడుకొని పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేయడానికి ’డిజిటల్ డైరీ’ని నిర్వహిస్తున్నామని, తప్పుడు ఫిర్యాదులు చేసే వారి వివరాలను కూడా రికార్డు చేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ ’వైఎస్సార్సీపీ టాక్స్’ వంటి డిజిటల్ వేదికలను ఏర్పాటు చేసి, స్థానిక కంటెంట్ క్రియేటర్లను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆకాంక్షలే శ్రీరామరక్షగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో పోటీ చేసి విజయం సాధించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందన్నారు. కాగా, నిరంతరం శ్రమిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచే కార్యకర్తల వివరాలను నేరుగా జగన్గారి దృష్టికి తీసుకెళ్తామని, భష్యత్తులో వారికి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీల వంటి గొప్ప రాజకీయ అవకాశాలు దక్కుతాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హామీ ఇచ్చారు. కూటమి వ్యాప్తి చేసే అబద్ధాలను మొదటి రెండు గంటల్లోనే వాస్తవ ఆధారాలతో తిప్పికొడుతూ ’అటాకింగ్ మోడ్’లోకి మారాలని, ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శకు పాత జీవోలు, ఎఫ్ఐఆర్ కాపీల వంటి పక్కా ఆధారాలను జత చేయాలని పార్టీ నాయకులు పూడి శ్రీహరి సూచించారు. అక్రమ కేసులు, వేధింపులకు భయపడకుండా ధృఢ సంకల్పంతో పని చేయాలని, కష్టకాలంలో ఉన్న కార్యకర్తలకు, వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహాన్ రెడ్డి నాయకత్వంలో అధికారం పరమావధిగా కాకుండా ప్రజల శ్రేయస్సు, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్థిరమైన రాజకీయ విధానంతో ముందుకు సాగుతోంది. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, సిద్ధాంతాలను, లైన్ ఆఫ్ థింకింగ్ను వదులుకోకుండా నిలబడడమే మన నాయకుడి నైజం. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగాన్ని తొలిసారిగా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థగా గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశాం. చంద్రబాబు నాయుడు ప్రజాబలం లేకుండా కేవలం భ్రమలు కల్పించే మీడియా వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, కుట్రలతో అధికారం చలాయిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మనపై, సాధారణ ప్రజలపై పోలీసులను వాడుకుని అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడుతుండడం వారి నైరాశ్యానికి నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టి, అబద్ధాలతో స్వర్గం చూపిస్తున్నది. పాలనలో విఫలమై, ప్రశ్నించే వారిపై వ్యక్తిత్వ హననానికి దిగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆకాంక్షలే శ్రీరామరక్షగా మన పార్టీ ధృఢంగా నిలబడింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో పోటీ చేసి స్వీప్ చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. నాయకత్వ నిబద్ధత, కార్యకర్తల కృషితో 2029లో గతంలో కంటే భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. పేదరికాన్ని నిర్మూలించేలా విద్యారంగంలో ఐబీ సిలబస్, వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో పాటు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్గారు చేసిన కృషిని ఉదాహరణలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సోషల్ మీడియాపై ఉంది. ప్రజామోదం పొందే పొలిటికల్ అజెండాతో, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన దాడి కొనసాగించాలి. ప్రతి సోషల్ మీడియా కార్యకర్త ఒక వన్ మ్యాన్ ఆర్మీలా, పదునైన కంటెంట్తో నిజాన్ని పదిమందికి చేరవేసే బాధ్యతాయుతమైన సైనికుడిగా పనిచేయాలి. ప్రతి నియోజకవర్గంలోనూ ’వైఎస్సార్సీపీ టాక్స్ వంటి వేదికలను ఏర్పాటు చేసి, కొత్త కంటెంట్ క్రియేటర్లను, ఆసక్తి ఉన్న యూత్ను ప్రోత్సహించి భాగస్వాములను చేయాలి. అంటూ కార్యకర్తలకు పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. మరి ఇక నుంచి వైసీపీ సోషియల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎంత వరకు ఎండగడుతుందొ వేచిచూడాలి.