○ కేవలం నిరసన చేస్తున్నారన్న కారణంతోనే లాఠీచార్జ్ చేయలేరు...
○ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ :
విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపుతూ పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించలేరని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ నిరసనల సందర్భంగా వారిపై పోలీసుల చర్యల విషయమై పలు పిటిషన్లు దాఖల కాగా.... వాటిపై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, కేవలం నిరసన జరుగుతోందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయలేరని తెలిపింది. అలాకాదని ఎక్కడైనా పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడితే..దాన్ని తప్పక అరికట్టాల్సిందేనంది. ప్రతి పౌరుడి హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రానిదే స్పష్టం చేసింది.ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని, దేశవ్యాప్తంగా విధివిధానాల్లో ఏకరూపత ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఈ విచారణ సందర్బంగా మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత ఎంత ముఖ్యమో, పోలీసుల భద్రత కూడా అంతే ముఖ్యం. నిరసనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడకూడదని పేర్కొన్నారు. పోలీసుల చర్యలకు సంబంధించి తగిన ఎస్ఓపీలు ఎందుకు లేవో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చని వ్యాఖ్యానించారు.