* పార్టీ కోసం పనిచేసిన వారికి పదవుల కోసం కమిటిల నియామకం ...
* పార్లమెంట్ కు ఓ పరిశీలకుడి నియామకం ...
* 29 నుంచి ధరఖాస్తుల సేకరణకు శ్రీకారం ...
* ఇప్పుడైనా పదవులు వస్తాయా ? .... లేక వివరాల సేకరణతోనే సరిపెడతారా ...!
Astranews desk :
ఎన్నాళ్లకెన్నాళ్లకు ... జనసైనికులకు శుభవార్త. పార్టీ ఆవిరభావం నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడిన, పనిచేసిన వారికి పార్టీ పదవులు కట్టబెట్టడం కోసం ఆ పార్టీ కొత్తగా సమాచార సేకరణ కమిటీల నియామకం చేపట్టింది. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి తపించిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవడానికి సమాచార సేకరణ కమిటీ'లను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని నియమిస్తామని గతంలోనే ప్రకటించిన విధంగా.. ఇప్పుడు 25 పార్లమెంటు నియోజక వర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను సోమవారం నిర్ణయించారు. వీరు ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వారు పార్టీలో ఏ స్థాయిలో, ఏలాంటి బాధ్యతలు తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నారో వివరాలు సేకరిస్తారు. వీరికి సహాయకులుగా ముగ్గురు సీనియర్ నాయకులను, ముగ్గురు సాదకులు, 21 మంది సమన్వయకర్తలు ఉంటారు.

ఇలా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సేకరించిన దరఖాస్తులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. వాటిని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ సేకరణ కమిటీలు కేవలం పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి, దరఖాస్తులను తీసుకోవడానికి పరిమితం అవుతాయి. ఈ కమిటీలు ఈ నెల 29వ తేదీ నుంచి తమ ప్రక్రియను ప్రారంభించనున్నాయి.
ఇప్పుడైనా న్యాయం జరుగుతుందా....లేక వివరాల సేకరణతోనే సరిపెడతారా ?
ఇంత కాలం పార్టీ కోసం పనిచేసిన వారిని వాడుకోవడం తప్పా వారికి న్యాయం చేసింది జనసేన చరిత్రలో లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ నిర్మాణం లేక పదవులు లేక ఎవరికి వారుగా తిరుగుతున్నారు. పార్టీ అంటూ గొంతు చించుకుంటూ రూడ్లపై తిరుగుతున్న పదవులు లేక సరైన గుర్తింపు లేక ... ఎవరికి చెప్పుకోవాలే తెలియక మథన పడుతున్నారు. గతంలో టిడిపితో పొత్తుతో అధికారంలోకి వచ్చినా ఏ ఒక్కరికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన దాఖాలాలు లేవు. ఇప్పుడైనా పార్టీ నిర్మాణంతో పదవులు .. గుర్తింపు... నామినేటెడ్ పదవులు వస్తాయని అందరు ఆశించారు. కానీ ఇంత వరకు అటువంటి ప్రయత్నే జరగలేదు. కేవలం అధినేత సోదరుడు నాగబాబుకు మాత్రం ఎమ్మెల్సీ ఇప్పించుకోవడంతో అందరికి న్యాయం జరిగినట్లుగా పవన్ ఫీలవుతున్నాడు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తయి. ఈ దశలోనూ పార్టీని జాతీయ స్థాయిలో బలోపేతం చేయబోతున్నామంటూ ప్రకటించి...ఢిల్లీలోను సమావేశం నిర్వహించారు. దీంతో ఇప్పడిప్పట్లో పార్టీ నిర్మాణం లేదు...నామినేటెడ్ పదవులు ఉండబోదంటూ అందరు చర్చించుకుంటున్నారు. ఈ దశలో పార్టీలో పదవుల భర్తీకి దరఖాస్తుల సేకరణకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. కానీ ఇంతకాలానికి పార్ట పదవుల భర్తీ చేపడితే తమకెప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయో అంటూ జనసైనికులు అయోమయానికి గురవుతున్నారు.