* మహా పాలిటిక్స్లో ఊహించని పరిణామం !.
* ఢిల్లీకి చేరుకున్న ఉద్దవ్, ఎంపిలు...
* షిండే వర్గంలో విలీనం చేయడానికి అనుమతించాలని స్పీకర్ కు ఎంపీల లేఖ
* ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తిరుగుబాటు ఎంపీలపై చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందంటున్న ఉద్దవ్...
మహారాష్ట్ర :
మహారాష్ట్ర రాజకీయాల్లో కమలం పార్టీ దెబ్బకు ఉద్దవ్ సేనలో మరో చీలికకు రంగం సిద్దమైంది. మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీలో నాలుగేళ్ల తర్వాత మరో భారీ చీలిక ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన మొత్తం తొమ్మిది మంది లోక్సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఉద్ధవ్ను వీడి, మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా కనీసం 14 నుండి 16 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మొత్తం వ్యవహారం ఢిల్లీ వేదికగా "ఆపరేషన్ టైగర్" పేరుతో జరుగుతున్నట్లు ప్రచారం సాగుతొంది. ఈ క్రమంలో నాగేష్ పాటిల్ అష్టికర్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, భావుసాహెబ్ వాక్చూరే, ఓమ్రాజ్ నింబాల్కర్ సహా ఆరుగురు ఎంపీలు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోగా, మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సైతం ఢిల్లీకి రావడంతో ఈ చీలిక ఖాయమైనట్లు తెలుస్తోంది.
గత ఆదివారం ఉద్ధవ్ థాకరే తన నివాసమైన మాతోశ్రీలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ ఎంపీలు రాలేదు. 48 గంటల్లోగా వచ్చి తనపై విధేయత నిరూపించుకోవాలని ఉద్ధవ్ గడువు విధించినప్పటికీ వారు స్పందించకపోవడంతో పార్టీ నుంచి వారు వీడుతున్నట్లు ఫిక్స్ అయ్యింది. ఈ ఎంపీలంతా మొదట ఢిల్లీలోని ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో సమావేశం కానున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి లోక్సభ స్పీకర్ను కలవనున్నారు. తమకు ప్రత్యేక వర్గంగా గుర్తింపు ఇవ్వాలని లేదా.. షిండే వర్గంలో విలీనం చేయడానికి అనుమతించాలని లేఖ సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉద్ధవ్ థాకరే కూడా ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంటులో కేవలం తమ శివసేనని మాత్రమే అధికారిక పార్టీగా గుర్తించాలని, విపక్ష వర్గానికి ఎలాంటి ప్రత్యేక హోదా ఇచ్చే ముందైనా తమ వాదనను వినాలని ఉద్ధవ్ వర్గం పార్లమెంటరీ పార్టీ నాయకుడు అరవింద్ సావంత్ లోక్సభ స్పీకర్కు అధికారిక లేఖ రాశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ అయిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తిరుగుబాటు ఎంపీలపై చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందంటున్నారు. ఓ వైపు పార్ట వదిలి వెళ్లాలనుకునే వేళ్లు శుబ్రంగా వెళ్లొచ్చని ప్రకటించిన ఉద్దవ్, మరో వైపు వరిపై వేటు వేసే దిశగా కూడా పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలోనే ఉద్ధవ్ సేన ముఖ్య నేతలు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్ కూడా ఢిల్లీకి చేరుకుని అత్యవసర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున అడ్వాన్స్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.