* కూటమిపై మాటల దాడి ...
* ఎపిలో రాజధాని దోపీడి నుంచి.. డిఎస్సీ అక్రమాల వరకు అన్ని ప్రజలకు తెలిశాయనే బ్లాక్ చేశారటూ మండిపాటు ...
YCP FACEBOOK BLOCK :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారిక ఫేస్బుక్ (Facebook) పేజీని సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) బ్లాక్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి చెందిన ఈ కీలకమైన ఖాతా భారతదేశంలో అందుబాటులో లేకుండా పోవడం ఇప్పుడురాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
వైసీపీ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో కొన్ని అశ్లీల చిత్రాలు (నీలి చిత్రాలు) ప్రత్యక్షం కావడం వల్లే, కమ్యూనిటీ నిబంధనల ఉల్లంఘన కింద 'మెటా' సంస్థ వెంటనే ఈ పేజీని బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హ్యాకింగ్ లేదా పొరపాటున ఈ కంటెంట్ పోస్ట్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాకింగ్పై అయన స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ట్విట్టర్ (X) ద్వారా ఆరోపించారు. అంతకుముందు ఇన్స్టాగ్రామ్ హ్యాండిళ్లను తొలగించారని, ఇప్పుడు ఫేస్బుక్ పేజీని నిలిపివేయడం అప్రజాస్వామికమని జగన్ ట్వీట్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ వైసీపీ అధికారిక పేజీని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు, సెన్సార్షిప్నకు లొంగబోమని, ఈ అన్యాయమైన చర్యలపై రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా పోరాటం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఇక ఆ పార్టీ ఎంపిలు సైతం కూటమి ప్రభుత్వ కుట్రలపై మండిపడుతున్నారు. ఎపిలో రాజధాని దోపీడి నుంచి.. డిఎస్సీ అక్రమాల వరకు అన్ని ప్రజలకు తెలిశాయనే బ్లాక్ చేశారటూ విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అరాచకాల్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైయస్ఆర్సీపీ ఎండగడుతూనే ఉందని, దాంతో ఓర్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం.. వైయస్ఆర్సీపీ అఫిషియల్ పేజీ భారత్లో కనబడకుండా చేయడం సిగ్గుచేటంటూ ఫైర్ అవుతున్నారు. గత రెండేళ్లుగా వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్లు చేయించారని, ఇప్పుడు వైయస్ఆర్సీపీ అఫిషియల్ పేజీ భారత్లో కనబడకుండా చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.