• ఇక తాడిపత్రి నియోజకవర్గంలో స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు న్యాయస్థానం అనుమతి
• తగిన భద్రత కల్పించాల్సిందిగా పోలీసు యంత్రాంగానికి ఆదేశం..
ASTRANEWS DESK :
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చాలా రోజుల అనంతరం హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఇక నుంచి ఆయన స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్ఢి అడ్డగింతలు, పోలీసుల ఆంక్షల నేపథ్యంలో రాజకీయ పర్యటనలకు అనుమతి కోరుతూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాడిపత్రిలో పెద్దారెడ్డి నిర్వహించే పర్యటనలు, రాజకీయ కార్యక్రమాలకు తగిన భద్రత కల్పించాల్సిందిగా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు నిబంధనను విధించింది. తాడిపత్రిలో ఎలాంటి బహిరంగ సభలు, రాజకీయ సమావేశాలు నిర్వహించాలనుకున్నా ఆ కార్యక్రమానికి కనీసం 24 గంటల ముందే స్థానిక జిల్లా ఎస్పీకి సమాచారం అందించాలని స్పష్టం చేసింది. 
హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో తాడిపత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినట్లయ్యింది. గత కొంతకాలంగా నియోజకవర్గ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న పెద్దారెడ్డి, ఇక నుంచి పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది.