* మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై ....
* మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు అసక్తికర వ్యాఖ్యలు ...
అమరావతి :
తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన పలు రాజకీయ అంశాలపై స్పందించారు. ప్రత్యక్షంగా, పర్చువల్గా నిర్వహించిన మహావాడుకు భారీ స్థాయిలో స్పందన లభించిందని, 24 లక్షల మందికిపైగా వర్చువల్గా మహానాడులో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల భాగస్వామ్యం మహానాడును విజయవంతం చేసిందన్నారు.
అనంతరం పలు రాజకీయ అంశాలపై మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు వివేకా కుమార్తె సునీతకు ఉందని, ఆమె పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేకా హత్య కేసు సజీవంగా ఉందన్నారు. సునీత పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయన్నారు. మహనాడు ముగిసిన సందర్బంగా శనివారం అయన మీడియాతో చిట్చాట్ నిర్వహించి పలు కీలక అంశాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర, హత్యా రాజకీయాల గురించి ప్రస్తుత తరానికి తెలుస్తోందని ఈ సందర్బంగా చంద్రబాబు చెప్పారు. వైఎస్ కుటుంబం అరాచకాల గురించి తనకు కూడా కొన్ని విషయాలు తెలియవని.. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయన్నారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన 'కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం' పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారని చెప్పారు. సైకో కంటే 'గొడ్డలి పార్టీ' అనే పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. గొడ్డలి పార్టీ అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లే కొద్దీ జగన్లో అసహనం పెరుగుతోందని ఎద్దేవా చేశారు.
నేర చరిత్ర ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలించవచ్చని చెప్పేవారు, జిల్లాల్లో నాయకులు రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, నక్సలైట్లు తుపాకులతో రాజ్యాధికారం సాధించవచ్చని భావించారని, కానీ ఆ ఆలోచన ఇప్పుడు విఫలమైందన్నారు. హింసే నక్సలిజం వైఫల్యానికి ప్రధాన కారణమన్నారు. "గొడ్డలితో పరిపాలన సాగిస్తామంటే కుదరదని, ఇది ప్రజాస్వామ్యమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ప్రజల మద్దతు పొందాలని సూచించారు.