నాపై సిఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరుపిస్తే రాజకీయాలు వదిలేస్తా... !
• చంద్రబాబుపై ఉన్న ఆరోపణలు నేను నిరుపిస్తా ...
• రాజకీయాలు వదిలేస్తాడా..?
• సిఎం చంద్రబాబుకు కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి సవాల్ ...
• దస్తగిరి హత్యతో డైవర్షన్ పాలిటిక్స్ ...
• పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీపై నిందలు...
కడప :
కడపలో వ్యక్తిగత కక్షలతో పెద్ద దస్తగిరిని ప్రత్యర్థులు చంపితే.. ముఖ్యమంత్రిగా వారి కుటుంబానికి న్యాయం చేయాల్సిన చంద్రబాబు, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దస్తగిరి హత్య పేరుతో ఎల్లో మీడియాలో రోజుకో తప్పుడు కథనంతో వైయస్సార్సీపీ మీద బురదజల్లి అంతిమంగా వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలకు పక్కా పథకం ప్రకారం వ్యూహ రచన చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా, నిత్యం ప్రైవేటు జపం చేస్తూ ప్రజల సంపదను తన బినామీలకు దోచిపెడుతున్నాడన్నారు.
నాపై సిఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరుపిస్తే రాజకీయాలు వదిలేస్తానని, చంద్రబాబుపై ఉన్న ఆరోపణలు నేను నిరుపిస్తానని, బాబు రాజకీయాలు వదిలేస్తాడా..? అంటూ సవాల్ విసిరారు. అలా నిరుపించడం చేతకాకపోతే ఇప్పటికైనా తప్పుడు విధానాలను మార్చుకుని పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. అవినీతి సంపాదన కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చంద్రబాబుని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
• దస్తగిరి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి... :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకుడు దస్తగిరిని వ్యక్తిగత కక్షలతో దారుణంగా చంపితే, ముఖ్యమంత్రిగా వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి... చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. మా పార్టీ నాయకుడి హత్యను మా పార్టీకే అంటగట్టాలని చూడటం కన్నా హేయం మరోటి ఉండదు. పోలీసులు మీడియాకు లీకులిస్తున్నారో, ఎల్లో మీడియా డైరెక్షన్లో పోలీసులు దస్తగిరి హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఏం సంబంధం లేకపోయినా ఎల్లో మీడియాలో పథకం ప్రకారం రోజుకో తప్పుడు కథనంతో వైసీపీ నాయకులను బాధ్యుల్ని చేసే కుట్రలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసిన వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రక్రియను చంద్రబాబు వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నాడు.
• రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు.. :
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులైపారుతోంది. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో టీడీపీ నాయకులే అడ్డంగా దొరికిపోతున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వ్యక్తిగత స్వార్థం కోసం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, రోడ్లు అన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదు. కానీ రూ. 2.56 లక్షల కోట్ల అప్పులు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో వేల కోట్ల అవినీతి జరుగుతోంది. విశాఖలో వేల కోట్ల విలువైన భూములను 99పైసలకే చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దిగజార్చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. నిరుద్యోగ భృతి లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ. 3200 కోసం నెట్వర్క్ ఆస్పత్రులు ధర్నా చేయాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. అందులో భాగంగానే దస్తగిరి హత్యతో చంద్రబాబు చౌకబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు చేస్తున్న విష ప్రచారాన్ని చూసి గోబెల్స్ బతికుంటే సిగ్గుపడేవాడు. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసిపాటి కిషోర్, ఎస్సీ సెల్ జోనల్ కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.