Delhi :
ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి అనుకున్నట్లుగానే కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు తాను క్షమాపణలు చెబుతున్నానని, కానీ మహిళా బిల్లును ఓడగొట్టి ప్రతిపక్షాలు సంబరాలు చేసుకున్నాయని ఘాటుగా విమర్శించారు.
మహిళా లోకం కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థరాజకీయాలకు బలైందని, మహిళల కలలను ధ్వంసం చేశారన్నారు. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసింది.. అని అన్నారు.
కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ లు కుటుంబ పార్టీలు.. వీళ్లు మహిళలను ఎదగనీయరు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం వాళ్లు ఎంతో పోరాటం చేశారు. ఎంతో నిజాయితీగా తాము తెచ్చిన బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని మండిపడ్డారు. మహిళా బిల్లు క్రెడిట్ తీసుకోవాలని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేశామన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా బిల్లును తీసుకొచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం మహిళల ఆత్మాభిమానంపై జరిగిన దాడి. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మర్చిపోరు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా బిల్లు తెచ్చాం. కాంగ్రెస్ పరాన్న జీవిగా తయారైంది. ఇతర పార్టీలపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. దేశ ప్రజలను విభజించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. డీలిమిటేషన్ ను సాకుగా చూపించి రిజర్వేషన్లను అడ్డుకున్నారు. బిల్లు ఆమోదం లభిస్తే అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరిగేవి. డీలిమిటేషన్ కారణంగా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నామని ప్రధాని మోదీ అన్నారు.