● మావిగన్ పై చర్చ వేళ మాజీ ఎంపి విజయసాయిరెడ్డి సూచన ..!
అమరావతి :
ఎపి రాజధాని అమరావతిని అప్పుల డబ్బుతో గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రే నిర్మించలేమంటూ మావిగన్ పై చర్చ వేళ మాజీ ఎంపి విజయసాయిరెడ్డి ఎపి ప్రభుత్వానికి సూచన చేయడం చర్చనీయాంశంగా మారింది.అమరావతి (Amaravati)ని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ మావిగన్ పేరుతో కొత్త రాజధాని ప్రాంతాన్ని తెరపైకి తెచ్చి కూటమి సర్కార్ ను టార్గెట్ చేస్తోంది.
ఈ నేపధ్యంలో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అమరావతిలో పెట్టే ఖర్చు తప్పుతుందని, రాష్ట్ర ప్రజలపై భారం కూడా పడదని వైఎస్ జగన్ చేసిన ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలో అనుకూల, వ్యతిరేక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) స్పందిస్తూ సీఎం చంద్రబాబు (Chandrababu)కు కీలక సూచన చేస్తూ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా బెంగళూరును 1537లో కెంపె గౌడ, హైదరాబాద్ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, చెన్నైని 1639లో ఫ్రాన్సిస్ డే ఆధ్వర్యంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాయని, అప్పటి నుంచి అభివృద్ది చేస్తూ వస్తే అవి నేటి మహానగరాలుగా మారాయాని, అందుకు 500, 430, 380 సంవత్సరాలు పట్టిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నగరాలు హడావిడిగా నిర్మించలేదని, తరతరాలుగా రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు.
కాబట్టి అమరావతిని కూడా అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రే నిర్మించలేమన్నారు. ప్రత్యేకించి అది చెప్పుకుంటున్నట్లుగా స్వయం సమృద్ధి కానప్పుడు అలా చేయలేమన్నారు.
ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన గృహాల వంటి ప్రాథమిక సౌకర్యాలను నిర్మించి, అక్కడితో ఆపాలని చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా ఇచ్చారు. ప్రజలు, వ్యాపారాలు, కాలంతో పాటు అమరావతి సహజసిద్ధంగా ఎదగనివ్వాలన్నారు. ఒక రాజధాని నగరం బలం నుండి ఎదగాలి కానీ అప్పుల నుండి కాదన్నారు. ఆకర్షణీయమైన డిజైన్లు, భారీ మౌలిక సదుపాయాలపై విచక్షణారహితంగా ఖర్చు చేయడం దార్శనికత కాదని, అది ఆర్థిక బాధ్యతారాహిత్యమే అన్నారు.
ఈ రోజు అనవసరంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం అవుతుందన్నారు. ఆదాయం ఆర్జించని ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలు శ్రేయస్సును సృష్టించవని, పైగా అవి ప్రజా ఖజానాపై భారం మోపుతాయన్నారు. పరిపాలనకు కార్యాచరణ అవసరమని, ఆడంబరమైన కట్టడాలు కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తను విస్మరిస్తే, అమరావతి ఒక ఆదర్శ రాజధానిగా కాకుండా, ఒక భారీ దుబారా కట్టడంగా మారే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి అమరావతిని అప్పుల డబ్బుతో...గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రే నిర్మించడం మానీ ఒక ఆదర్శ రాజధానీగా నిర్మించాలని సూచించారు.