• వైసీపీ హయాంలో అభివృద్ది లేదనడం సిగ్గుచేటు...
• అభివృద్దిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తండ్రి, మంత్రి జనార్దన్ రెడ్డి చర్చకు వస్తారా అంటూ సవాల్..
• వైఎస్ జగన్ మేనమామ అయినందుకు గర్వపడుతున్నా..
కడప :
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ హాయంలో అభివృద్ది జరగలేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని, మంత్రి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయని వైసీసీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప నగరం వైఎస్ఆర్ సి పి జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైల్వే వంతెనకు భూమి పూజ చేసేందుకు వచ్చారని, కానీ ఆయనేదో చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. వచ్చిన పని చూసుకొని పొతే అందులో ఏముంటుందన్న ఉద్దేశ్యంతో వైసీపీపై బురదజల్లారని అగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మేనమామ రెండు సార్లు కమలాపురం ఎమ్మెల్యే గా వున్నందుకు సిగ్గుపడాలని మంత్రి వాఖ్యలు చేసారని, కమలాపురంలో ఏమి అభివృద్ధి జరిగిందో మంత్రి పట్టణంలో తిరిగితే తెలిసేదని, కానీ వాస్తవం ఎంటో తెలుసుకోకుండా మాట్లాడినందుకు ఆయనే సిగ్గుపడాలన్నారు. కమలాపురంలో ఇరుకైన అమ్మవారిశాల వీధిలో రోడ్డు విస్తరణ చేపట్టామని, వర్షాలు వచ్చిన ప్రతీ సారి మునకకు గురయ్యే పరిస్థితి ఉంటే దాన్ని చక్కదిద్దామన్నారు. పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ వైద్యాశాలలను నిర్మించడం జరిగిందని, త్రాగునీటి, డ్రైనేజీ వ్యవస్థ చక్కదిద్దడం జరిగిందని వివరించారు. రైల్వే వంతెనకు వైసీపీ హాయంలోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 67 వంతెనలు మంజూరు చేస్తే ఏపీలో కమలాపురం వంతెనకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ
ఇప్పటి కూటమి నేతలు క్రెడిట్ చోరీ తప్ప వేరే ఏమిలేదన్నారు. దీనిపై
ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, ఎమ్మెల్యే తండ్రి పుత్తా నరసింహారెడ్డి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. అభివృద్ది మరచి ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నదెవరో చెప్పాలని ప్రశ్నించారు. యంత్రాలను పెట్టి రోజుకు 25లక్షల నుంచి 30లక్షలు సహజ వనరుల నుంచి దోచుకుంటున్నారని విమర్శించారు.
కడప నుంచి ఇసుకను తరలించి మంత్రి జనార్దన్ రెడ్డి సొమ్ము చేసుకుంటున్నారని, క్రషర్ లను పెట్టి ముమ్మరంగా మైనింగ్ దోచేస్తున్న దుయ్యబట్టారు. ఏ పని చెయ్యాలన్నా దానికో రేటు కట్టి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గంలో అయన సతీమణి ఇందిరానే పెద్ద వసూల్ రాణి అని ఆరోపించారు. కమలాపురంలో చేసిన అభివృద్దితో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మేనమామ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. అంతేకాకుండా సీఎం వస్తున్నారంటే జిల్లా అధికారులతో అభివృద్ధి, సమస్యలపై సమీక్ష చెయ్యాల్సి ఉంటుందని, కానీ హార్టికల్చర్, అగ్రికల్చర్ రైతులు ధరలు లేక నష్టపోతున్నా పట్టించుకోకుండా సిఎం చంద్రబాబునాయుడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చి వెళ్లిపోయారన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ది ఏ పాటిదో అర్దమవుతుందన్నారు.