• అల్ అక్సా మసీదు సమీపంలో పడిన క్షిపణి...భారీ విధ్వంసం...
• ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ప్రార్థనలు
• జెరూసలెంను తాకిన ఇరాన్ మిస్సైల్
• తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ...
Iran Missile Hits Jerusalem :
అమెరిక - ఇజ్రాయెల్ వార్ లో ఇరాన్ చెలరేగిపోతుంది.
ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంను ఇరాన్ మిస్సైల్ తాకింది. అంతేకాక పవిత్ర అల్ అక్సా మసీదుకు కూతవేటు దూరంలో మిస్సైల్ పడింది. ఈ దాడితో ఈద్ ప్రార్థనలకు ఆటంకం ఏర్పడింది. జెరూసలెం ఓల్డ్ సిటీలోని అల్ అక్సా మసీదుకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్ మెరుపు దాడితో మసీదు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ పర్వదినం వేళ మసీదులో ప్రార్థనలు చేసేందుకు ఎవరినీ అనుమతించలేదు. దీంతో వందలాది మంది ముస్లింలు గేట్ల బయటే ప్రార్థనలు చేశారు. గత 60 ఏళ్లలో అల్ అక్సా మసీదు మూతపడటం ఇదే తొలిసారి.
ఇరాన్ జరిపిన మెరుపు దాడితో జెరూసలెం ఓల్డ్ సిటీ సైతం దద్దరిల్లిపోయింది. ఈ దాడిపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. "ఈద్ అల్-ఫితర్ పండుగ సమయంలో ముస్లింలు, క్రైస్తవులు, యూదులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలకు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న జెరూసలెంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ముల్లాల 'మత' పాలన అని పిలవబడే దాని అసలు స్వరూపం ఇదే" అంటూ మండిపడింది. దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ.
మరోవైపు యుద్ధం రగిలిపోతున్న పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ 22 దేశాలు ఇరాన్ కు విజ్ఞప్తి చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై ఇరాన్ చేస్తున్న దాడులను ముక్త కంఠంతో ఖండించాయి. ఈ చర్యల వల్ల అన్ని దేశాలపై తీవ్రమైన ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. అంతేకాదు పొరుగు దేశాలపైనా వెంటనే దాడులను ఆపేయాలని ఇరాన్ ను కోరాయి. ఈ మేరకు యూఏఈ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, డెన్మార్క్, కెనడా, బహ్రెయిన్ తదితర దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
గల్ఫ్ ని నిరాయుధ వాణిజ్య నౌకలు, చమురు, గ్యాస్ కేంద్రాలు సహా మౌలిక సదుపాయాలపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడులను, హర్మూజ్ జలసంధి మూసివేత చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నాయి. సముద్ర చట్టాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒప్పందంతో పాటు స్వేచ్చాయుత నౌకాయానం అనేది అంతర్జాతీయ చట్టంలో ప్రాధమిక సూత్రం అని తెలిపాయి. ఇరాన్ చర్యలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని ప్రకటనలో వెల్లడించాయి.