- నెల్లూరు జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..
- స్వగతం పలికిన మాజీ మంత్రులు కాకాణి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ...
- భారీగా తరలివచ్చి బాణాసంచా కల్చుతూ కార్యకర్తల సందడి...
నెల్లూరు :
మాచెర్ల మాజీ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 99 రోజుల అనంతరం నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. వెల్దూర్తి మండలంలో జంట హత్య కేసులో గురజాల కోర్టు నిన్న బెయిల్ మంజూరు చెయ్యడంతో అయన ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్బంగా పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి తమను 99 రోజుల పాటు జైలులో ఉంచారని, తమకు ఒక రోజు వస్తుందని, ఎవ్వర్ని వదిలేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు విడుదలైన పిన్నెల్లి మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా నెల్లూరు జైలు వద్దకు భారీగా చేరుకున్న వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పిన్నెల్లిని భుజాలపైకి ఎత్తుకొని నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చారు.

ఈ సందర్బంగా పిన్నెల్లి మాట్లాడుతూ వెల్దూర్తి గ్రామంలో టిడిపిలోని రెండు వర్గాల కొట్లాడుకుని హత్య చేసుకుంటే అన్యాయంగా, అక్రమంగా తమను 99 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు. హత్యకు నెల రోజుల క్రితం కూడా గ్రామంలో టిడిపిలోని రెండు వర్గాల మధ్య గోడవలు జరిగాయని, ఈ దాడి అనంతరం జిల్లా ఎస్పీ కూడా గ్రామాన్ని సందర్శించారని, అయనకు అన్ని విషయాలు తెలుసునన్నారు. టిడిపిలోని ఇరు వర్గాలే కొట్లాడుకుని వారే చంపుకున్నారని చెప్పడం జరిగిందన్నారు. కానీ ఉద్దేశ్య పూర్వకంగా తమను ఇరికించారని, మాకు ఒక రోజు వస్తుందని, అప్పుడు అధికారులు, నాయకులు ఎవ్వరిన్ని వదిలేదు లేదని హెచ్చరించారు. మాపై కేసులు పెట్టిన వారు ఎవరో ... వారు మా ఆఫీసుకు ఏనాడు వచ్చింది లేదని, వారి ముఖాలు కూడా చూడలేదన్నారు. అయినా అక్రమంగా కేసులో ఇరికించారని, మాకు ఒక రోజు వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు.
