Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

చంద్రబాబునాయుడు కుట్రలో సునీతమ్మ పావు...!

16 Mar 2026
05:54 PM
36

* బాబు స్క్రిప్ట్‌ ప్రకారమే సునీత ఆరోపణలు...
* వివేకా హత్యను జగన్‌కు అంటగట్టే యత్నం
* ఏ విధంగా సంబంధం ఉందో ఆమే చెప్పాలి
* జగన్‌ దంపతుల్ని ఇరికిస్తే కానీ మీ కక్ష తీరదా?
* వివేకా హత్యలో మరో కోణం స్పష్టంగా కనిపిస్తోంది
* అయినా ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు?
* ఏడేళ్లుగా అదేపనిగా వైఎస్‌ కుటుంబ పరువు తీస్తున్నారు
* ప్రొద్దుటూరులో  వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ...
 
ప్రొద్దుటూరు   :
వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ ఏడేళ్ల పాటు దర్యాప్తు చేసి ఛార్జిషీట్లు వేసిన తర్వాత కూడా, ఇంకా దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన కుమార్తె సునీత చేస్తున్న ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆమె మనసులో నాటిన విషబీజమే అందుకు కారణమని చెప్పారు. జగన్‌ దంపతుల్ని సీబీఐ పిలిపించే వరకూ ఆమె సంతృప్తి చెందేలా లేదని ఆక్షేపించారు. ఇప్పటికైనా సునీత వాస్తవాలు గుర్తించాలని, తన విధానం మార్చుకోవాలని ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హితవు చెప్పారు.
 
ఏడేళ్లవుతున్నా ఆగని రాజకీయ కుట్రలు  :
నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా మాట్లాడటం లేదు, వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఓ సగటు మనిషిగా మాట్లాడుతున్నాను. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళైంది. సీబీఐ తమ దర్యాప్తు ముగిసిందని, ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేశామని, ఇకపై దర్యాప్తు చేయాల్సిన, కొత్త ముద్దాయిలను చేర్చాల్సిన అవసరం లేదని తేల్చేసింది. అయినా ఈ హత్యపై రాజకీయ కుట్రలు మాత్రం ఆగడం లేదు. కారణం,  చంద్రబాబు రాజకీయ కుట్రలో సునీత పావుగా మారారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారో తెలియాలని ఆమె కోర్టును, సీబీఐని అడుగుతున్నారు. కానీ, అవన్నీ సీబీఐ పత్రికలకు ఇచ్చిన ఛార్జిషీట్‌ వివరాలు, సాక్షులు, నిందితుల వాంగ్మూలాలతో తేటతెల్లమయ్యాయి. అయినా, ఒప్పుకోని సునీత, తన తండ్రిని ఎవరు వెనక ఉండి హత్య చేయించారని అడుగుతున్నారు. 
 
ఏ కారణం లేదు. సునీత ఎందుకు ఆలోచించడం లేదు  ? :
ఆర్ధిక లావాదేవీలు, అక్రమ సంబంధాలు, అధికారం, అవమానం వంటివి చాలా వరకు హత్యలకు కారణమవుతాయి. వాటి వల్లనే ఒక మనిషి తన విచక్షణ కోల్పోయి ప్రాణం తీసే వరకు వెళ్తాడు. అందుకే వివేకా హత్య కేసుకు సంబంధించి, ఈ నాలుగింటిలో ఏ ఒక్క కారణం అయినా జగన్‌గారు, భారతికి సంబంధించింది ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి. బాబాయితో జగన్‌గారికి ఆస్తి తగాదాలు లేవు. ఇక ఇక్కడ అక్రమ సంబంధం ప్రస్తావనకు తావే లేదు. ఇంకా తన తండ్రి తర్వాత అంతటి గౌరవం ఇచ్చిన బాబాయికి జగన్‌గారి దగ్గర దక్కింది అభిమానమే తప్ప అవమానం కాదు. ఇక మిగిలింది అధికారం. వివేకానందరెడ్డి నుంచి అధికారం తీసుకోవాల్సిన అవసరం జగన్‌గారికి ఎలాగో లేదు. మరి దేనికి ఈ హత్య జరిగిందో సునీత ఆలోచించాలి. 
 
సునీత మనసులో చంద్రబాబు విషబీజం :
చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే వివేకానందరెడ్డి హత్య జరిగింది. అంటే తన రాజకీయ ప్రత్యర్థిని ఇరికించడానికి కుట్ర జరిగి ఉండాలి. ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే సునీత పలుమార్లు కోర్టులకు వెళ్లారు. కాల్‌ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో చెప్పారు. వివేకా హత్య కేసులో ముద్దాయిలు ఎవరంటే సీబీఐ అరెస్టు చేసిన నిందితులు తామే అని అంగీకరించారు. ఇంకా ఎవరు చేయించారంటే ఎర్ర గంగిరెడ్డి అని వారే స్వయంగా చెప్పారు. ఆర్ధిక లావాదేవీలు, అక్రమ సంబంధాల వ్యవహారమే ఇందుకు కారణమని కూడా వారు వాంగ్మూలాలు ఇచ్చారు. కానీ, ఎందుకో సునీత వాటిని అంగీకరించడం లేదు. ఆమె మనసులో చంద్రబాబు విష బీజం నాటారు. అది ఒక వృక్షం మాదిరిగా మారడంతో సునీత మనసు పాడైంది. దీనికి తోడు పచ్చ మీడియా ఆమెకు అపోహలు కల్పించింది. దీని ఫలితమే అవినాష్‌రెడ్డిని ముద్దాయిని చేసి, చివరకు భాస్కర్‌రెడ్డిని కూడా జైలుకు పంపే వరకూ వెళ్లింది. 
 
నిజానికి వివేకా మరణం తర్వాత, ఆరోజు అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివేకా మరణంపై సమాచారం ఇచ్చింది సునీత మేనమామ శివప్రకాష్‌రెడ్డి. కానీ, ఆయనను అనుమానించకుండా, ఆరోజు ఎక్కడో జమ్మలమడుగు ప్రచారంలో ఉన్న అవినాష్‌రెడ్డిని అనుమానిస్తున్నారు. ఈ కేసులో భాస్కర్‌ రెడ్డి జైలు జీవితం అనుభవించినా, ఇంకా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నా సునీతకు సంతృప్తి లేదు. ఎందుకంటే చంద్రబాబు కోరిక ప్రకారం జగన్‌ దంపతుల్ని సీబీఐ విచారణకు పిలిస్తే తప్ప, ఆమె తృప్తి చెందేలా కనిపించడం లేదు.   
 
వివేకా హత్యలో మరో కోణాన్ని ఎందుకు ఆలోచించరు? :
తన తండ్రి మరణం హత్య అని సహజ మరణం కాదని ప్రపంచానికి చెప్పడం.. ఆ హత్య చేసిన వారు, చేయించిన వారికి న్యాయస్థానం ద్వారా శిక్ష వేయించడం ఆమె బాధ్యత. దాన్ని మేం కూడా స్వాగతిస్తాం. కానీ చంద్రబాబు, పచ్చ మీడియా పుణ్యమాని బిడ్డగా తన బాధ్యత నిర్వర్తించాల్సిన పరిధిని దాటి నేరం చేయని వారిని, నిరపరాధుల్ని కూడా జైళ్లలో మగ్గపెట్టే స్థాయికి, కక్ష సాధించే స్థాయికి సునీత వెళ్లడం దురదృష్టకరం. ఇక్కడ అనేక విషయాలను జగన్‌గారు, ఆయన కుటుంబం చెప్పే వీలున్నా, కేవలం చనిపోయిన తన బాబాయి పరువు తీయడం ఇష్టం లేకనే మౌనంగా ఉన్నారు.  మరోవైపు జగన్‌గారిని పదే పదే ఆరోపణలు చేస్తున్న సునీతతో పాటు, ఇక్కడ ప్రజలు కూడా వాస్తవాలు గుర్తించాలి. వివేకానందరెడ్డి మరో ముస్లిం మహిళతో అక్రమ సంబంధం నెరపడం, బిడ్డను కనడం చూస్తే ఎవరికైనా బాధ, కోపం కలుగుతుంది. ఇదే హత్యకు కారణంగా భావించి విచారణ చేయాలని మేం కోరడం లేదు. అదే జరిగితే కుటుంబ గౌరవం బజారున పెట్టినట్లు అవుతుంది. కానీ, అది జగన్‌గారికి, ఆయన కుటుంబానికి ఇష్టం లేదు. నిజానికి వివేకానందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఈ కారణం వల్లే మాటలు లేకుండా పోయాయని, చివరకు ఆయన చెక్‌పవర్‌ కూడా రద్దు చేశారని సమాచారం. మరి ఆ దిశలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదనేది మా ప్రశ్న. 
 
వైయస్‌ కుటుంబ పరువును బజారుకీడుస్తున్నారు :
ఈ కేసులో ఎలాగైనా జగన్‌ దంపతులను ఇరికించాలనేది చంద్రబాబు కుట్ర. ఆ కుట్రలో సునీత కూడా పావులా మారుతున్నారు. అదే ఇక్కడ బాధాకరమైన విషయం. వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేసిన వారిపైనే ప్రతీకారం తీర్చుకోకుండా వదిలేసిన చరిత్ర వైఎస్‌ కుటుంబానిది. జగన్‌గారికి కూడా తన రాజకీయ శతృవులను భౌతికంగా తుదముట్టించాలనే ఆలోచన ఉండదు. తన రాజకీయ ప్రత్యర్దులపై గెలిచి అధికారంలోకి రావడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడటమే ఆయన తన విజయంగా భావిస్తారు. అయినా వైఎస్‌ కుటుంబ గౌరవాన్ని మంటగలిపేలా సునీత ప్రయత్నిస్తూనే ఉన్నారని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆక్షేపించారు.
 
 
 
Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!