Kakinada :
ఎపిలో పెను సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ కొనసాగుతోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి.. కారులో డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు గతంలో వెల్లువెత్తిన విషయం తెలసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు ఆయన భార్య లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉందని పేర్కొన్న పోలీసులు.. ఈ కేసులో ఆమెను ఏ2 నిందితురాలిగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు లక్ష్మీదుర్గ.. సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణాధికారి ఎస్డీపీవో మనీష్ పాటిల్ దేవరాజ్ ఆఫీసులో ఆమెను విచారణ చేపట్టారు.
తమ వద్ద డ్రైవర్గా పనిచేసి.. ఉద్యోగం మాసేసిన సుబ్రహ్మణ్యంను చంపేసి.. డోర్ డెలివరీ చేశారు అనే కేసులో అనంతబాబుపై కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో అనంతబాబుకు లక్ష్మీదుర్గ సహకరించినట్లు ఇటీవల చేసిన విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ కారణంగానే లక్ష్మీదుర్గను ఈ కేసులో ఏ2గా చేర్చి రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అడిషనల్ ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆమెకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కానీ తనపై నమోదైన నాన్ బెయిలబుల్ వారెంట్ను కొట్టివేయాలని కోరుతూ లక్ష్మీదుర్గ ఎపి హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈనెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని లక్ష్మీదుర్గకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విచారణ తర్వాత ఈనెల 30వ తేదీన రాజమహేంద్రవరం కోర్టు ముందు హాజరవ్వాలని తీర్పు వెలువరించింది. దీంతో ఇన్నేళ్లపాటు ఆచూకీ లేకుండా అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ.. నేడు సిట్ అధికారుల ముందుకు వచ్చారు.
2022 మే 19వ తేదీన రాత్రి సుబ్రహ్మణ్యం హత్య జరిగినట్లు, ఆ హత్య జరిగిన సమయంలో లక్ష్మీదుర్గ కూడా అక్కడే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సుబ్రహ్మణ్యంను హత్య చేసిన తర్వాత ఆమె తన భర్త అనంతబాబుతో కలిసి కారులో తమ ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చిన రిపోర్టుల్లోనూ లక్ష్మీదుర్గ పాత్ర ఉందని స్పష్టంగా పేర్కొనడంతో ఆమెను నిందితురాలిగా చేర్చారు.
ఇక హత్య చేసిన రోజు తాను అక్కడ లేనని తమ బంధువులకు అస్వస్థతకు గురైతే పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లినట్లు గతంలో పోలీసులకు లక్ష్మీదుర్గ వివరించారు. అయితే ఆమె చెప్పినవన్నీ అబద్ధాలేనని పోలీసులు పక్కా టెక్నికల్ ఆధారాలతో తేల్చారు. ఈ నేపథ్యంలోనే సిట్ తొలి రోజు విచారణలో వాటిపైనే ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి.