War effect on Rayalaseema Banana Farmers :
అమెరికా-ఇజ్రాయేల్- ఇరాన్ యుద్దం నేపధ్యంలో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తత పరిస్ధితుల వల్ల రాయలసీమ ప్రాంతంలోని అరటి రైతులపై తీవ్ర ప్రభావం పడింది. దీని ఫలితంగా అరటి ఎగుమతులు ఆగిపోయి... మార్కెట్లలో ధరలు పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.20,000 నుండి రూ.25,000 వరకు పలికింది. ఇప్పుడు టన్నుకు రూ.8,000కు ధర పడిపోయింది.

రాయలసీమలోని కడప, అనంతపురం ప్రాంతాలలో ప్రధానంగా పండించే అరటికి దక్షిణ, ఉత్తర రాష్ట్రాలలోనే కాకుండా గల్ఫ్ దేశాలలో సైతం మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి పంటను వ్యాపార సంస్థలు సాధారణంగా తోటలను సందర్శించి గ్రామంలోని రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తాయి. వాటిని ప్యాకేజీ చేసి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తారు. టర్కీలో అరటిపండ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి పండ్లు వారం పాటు నిలవవని వ్యాపారులు చెబుతున్నారు. రాయలసీమ అరటిపండ్లు దాదాపు 12 రోజులు ఉండటం వల్ల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది.
కానీ ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతల కారణంగా అరటి ధరలు అకస్మాత్తుగా పడిపోవడం రైతులను ఆందోళనకు గురిచేసింది. తోటలోనే అరటిపండ్లు ఉన్నాయి. ఇంకా తెంపలేదు. ఈ యేడాది మొదట్లోనే ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల కాయలు చెట్లపైనే పండై నేలరాలిన పరిస్ధితి అరటి రైతులను తీవ్ర నష్టాల పాలు చేసింది. వర్షాల వల్ల కాయలు చెట్లపైనే పండు కావడంతో రైతుకు నష్టం వాటిల్ల్తే.. ధర కూడా దారుణంగా పడిపోయింది. పంటను కోనే వారే లేక తీవ్ర నష్టాల పాలయ్యారు. కానీ ఐదు నెలల తరువాత ధర పుంజుకుని 20 వేలకు పైనే చేరింది. ప్రస్తుతం 20 నుంచి 25 వేల వేరకు పలుకుతుంది. మొదట్లో నష్టాల పాలైన ఇప్పుడిప్పుడే రైతుకు మంచి ధర ఉండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
కానీ ఇప్పుడు పశ్చిమాసియా పరిస్ధితుల కారణంగా కోనుగోళ్లు లేక ధర అమాంతం పడిపోయింది. ప్రస్తుత ధరతో ఎరువులు, పురుగుమందులపైనా పెట్టిన పెట్టుబడులను కూడా తిరిగి పొందలేకపోతున్నారు రైతులు. అరటి రైతులను కాపాడటానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అనంతపురంలో 16000 హెక్టార్లలో కడపలో 26,000 హెక్టార్లలో, కర్నూలు జిల్లాలో 5,000 హెక్టార్లలో అరటి తోటలు విస్తరించి ఉన్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్లో అనంతపురంలో 13 లక్షల టన్నులు, కడప జిల్లాల్లో 11 లక్షల టన్నులు సహా 40 లక్షల టన్నులకు పైగా మంచి దిగుబడి వచ్చింది. రైతులు నెల రోజుల క్రితమే తమ పంటలో సగం అమ్మేసినప్పటికీ, మిగిలిన ఉత్పత్తి అమ్మకాల్లో ఇబ్బందులు ఉన్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం అరటి సాగుకు, ముఖ్యంగా నాణ్యమైన 'A' గ్రేడ్ అరటికి ప్రసిద్ధి. ఇదొక్క నియోజకవర్గంలోనే సుమారు 13,800 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో అరటి సాగవుతోంది. ఇక్కడి అరటికి ఉత్తర భారతదేశంతో పాటు గల్ఫ్ దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మరియు ఎండల తీవ్రతతో ఇటీవల ధరలు టన్నుకు ₹8,000-13,000కు పడిపోగా, పంట దిగుబడితో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ, కలకత్తాతో సహా స్థానిక మార్కెట్లకు మాత్రమే అరటిపండ్లు రవాణా అవుతున్నాయి. యుద్ధానికి ముందు ప్రతిరోజూ 7-10 ట్రక్కులను రవాణా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మూడు ట్రక్కుల వరకు మాత్రమే ఆర్డర్లు వస్తున్నాయని రైతుల ఆవేదన చెందుతున్నారు.