● గ్యాస్ సప్లై ఇష్యూ' పేరుతో బిల్లులో అదనపు ఛార్జీలు....
● ఇదేం బాదుడు రా సామీ అంటున్న కష్టమర్లు... ! !
● కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో...
● ఆ భారాన్ని ఏకంగా కస్టమర్ల మీదనే వేసేస్తున్న హోటళ్లు....
Gas tax issue on hostels:
ఇప్పటి వరకు హోటల్కు వెళ్లి టిఫిన్ చేస్తే ఇడ్లీ, వడ ధరలతో పాటు చివర్లో జీఎస్టీ వేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో, యాజమాన్యాలకు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఆ భారాన్ని ఏకంగా కస్టమర్ల మీదనే వేసేస్తున్నాయి కొన్ని హోటళ్లు.
గ్యాస్ సప్లై ఇష్యూ' పేరుతో బిల్లులో అదనపు ఛార్జీలు చూసి జనం అవాక్కవుతున్నారు. 
చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో ఈ విధానం మొదలైంది. చెన్నైలోని 'గీరాస్' రెస్టారెంట్లో జరిగిన ఇలాంటి సంఘటన హాట్ టాపిక్గా మారగా....ఒక్కసారిగా చాలా వరకు హోటళ్లకు విస్తరించింది. టిఫిన్ చేసిన ఒక వ్యక్తికి వచ్చిన బిల్లు చూసి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇడ్లీ, వడ ధరల కిందే ప్రత్యేకంగా 'గ్యాస్ ఛార్జ్' అని పేర్కొని సుమారు 10 రూపాయల వరకు వసూలు చేశారు. మొత్తంగా 85 రూపాయల బిల్లులో గ్యాస్ కోసం అదనంగా రూ.10లు చెల్లించాల్సి రావడంతో కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్ అయ్యింది.
పీజీలో తిండి లేక హోటల్ కు వెళ్తే.. 'గ్యాస్ బాదుడు ' .. !
ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన గ్యాస్ బాదుడు కేవలం చెన్నై మాత్రమే కాదు, ఐటీ హబ్ బెంగళూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ 'మిస్టర్ ఆంధ్ర మీల్స్' అనే హోటల్కు వెళ్లిన కష్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. గ్యాస్ కొరత సాకుతో ఏకంగా 30 రూపాయలు అదనంగా వసూలు చేశారు. "పీజీలో తిండి లేక హోటల్కు వెళ్తే.. అక్కడ ఇలా గ్యాస్ పేరుతో దోచుకుంటున్నారా?" అంటూ వారు బెంగళూరు సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గ్యాస్ కొరత ఉంటే ధరలు పెంచుకోవాలి కానీ, ఇలా విడిగా బిల్లు వేయడం ఏంటని వారు ప్రశ్నించారు. 
సంక్షోభం ఏదైనా బలి అయ్యేది మధ్యతరగతి వాడే అంటూ.....నెటిజన్ల ఫైర్.. ! :
ఈ బిల్లులపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "సంక్షోభం ఏదైనా బలి అయ్యేది మధ్యతరగతి వాడే" అని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా, "బిల్లులో గ్యాస్ ఛార్జ్ చూడటం చాలా హాస్యాస్పదంగా ఉందంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఆహార పదార్థాల ధరలోనే లాభం, ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి కదా.. మళ్ళీ గ్యాస్ కోసం విడిగా వసూలు చేయడం పచ్చి దోపిడీ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల కొరతతో కొన్ని హోటళ్లు మూతపడగా, నడుస్తున్న కొన్ని హోటళ్లు ఇలా కస్టమర్ల మీద భారం వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఎల్పీజీ కష్టాలు తీరకపోతే ఇలాంటి బాదుడ్లు ఎన్ని ఉంటాయో వేచి చూడాలి.