షాడో ఎస్పీగా చక్రం తిప్పి... చివరకు సస్పెండ్ ...!
• కడపలో సిఐ అశోక్ రెడ్డిపై వేటు...
• విచారణలపై విచారణలు చేపట్టి... చివరకు వేటేసిన ప్రభుత్వం... !
• గత ప్రభుత్వ హాయంలో చేసిన సెటిల్ మెంట్లు, బెదిరింపులు, బిటెక్ రవి అరెస్ట్ మెడకు చుట్టుకున్నాయా... ?
కడప :
గత వైసీపీ ప్రభుత్వంలో సిఐ అశోక్ రెడ్డి దాదాపుగా 4 యేళ్లు షాడో ఎస్పీగా చక్రం తిప్పారు. అన్ని తానై చక్కబెట్టారు. ప్రతిపక్ష పార్టీ నేతలను గన్ పెట్టి మరి బెదిరించి అరెస్టు చేశారు. ప్రభుత్వం మారాకా ...గత ప్రభుత్వ హాయంలో చక్రం తిప్పిన అధికారులపై కక్ష సాధింపుకు పాల్పడిన కూటమి నేతలు....అశోక్ రెడ్డిపై కూడా చర్యలు తప్పవని అందరు భావించారు. కానీ రెండేళ్ల పాటు విచారణలు సాగినా ... ఎట్టకేలకే ఇప్పుడు వేటు పడింది. ఈ సస్పెన్షన్ వేటు వెనక ఏం జరిగిందో ఒక సారి చూస్తే....
కడప నగరంలో చిన్నచౌక్, చింతకొమ్మదిన్నె సర్కిల్ ల పరిధిలో సిఐగా పనిచేశారు. సిఐగా పని చేస్తూనే జిల్లా స్థాయిలో షాడో ఎస్పీగా కూడా చక్రం తిప్పారు. అంతేకాదు మితిమీరిన సెటిల్ మెంట్లు చేసి కోట్లు సంపాదించి బినామీ సంస్థలు పెట్టారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఈయన కొంత మందికి భారీగా ఫైనాన్స్ కూడా ఇచ్చారనే ప్రచారం ఉంది. అంతేకాకుండా కడప, బెంగుళూరు, బళ్లారి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కూడబెట్టారన్న ప్రచారం సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చాకా వీటిపై కూడా పూర్తి స్థాయిలో కూపీ లాగింది. వీటితో పాటు అక్రమ అరెస్టులు, అణచివేతలు, కాల్ లిస్ట్, లొకేషన్ ఐడెంటిఫికేషన్ వంటి సాంకేతిక పరిజ్ఘానాన్ని ఉపయోగించుకుని రెచ్చిపోయారని ఆరోపణలున్నాయి. ఎన్నికల బెట్టింగ్ లోనూ కీలకంగా వ్యవహరించారని అరోపణలున్నాయి.
ఇదంతా ఓ ఎతైతే వైసీపీ అధినేతను, అప్పటి ప్రభుత్వాన్ని పలు సందర్బాల్లో తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పులివెందుల టిడిపి ఇన్ చార్జి బిటెక్ రవిని కడప-పులివెందుల మార్గంలో అపహరించి గన్ తలపై పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారనే అరోపణలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా బిటెక్ రవి పలు సందర్బాల్లో బాహటంగా చెప్పుకున్నారు.
కానీ కాలం మారింది. అధికారం ప్రతిపక్షమైంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అప్పట్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసి తమను వేధించిన ఆ సిఐ తీవ్ర ఇబ్బందులు పడతారని అందరు అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. జరిగిన పరిణామాలన్ని అటు నాయకుడు...ఇటు ఆ అధికారి మరచిపోయారట. ఎందుకు ఎమిటి అంటే దాని వెనక పెద్ద తతంగమే నడిచిందట. ఏడు నెలల క్రితం ఈ సిఐ వ్యవహారానికి సంబంధించి విచారణ చెయ్యమని అప్పటి ఎస్పీకి ఆదేశాలు వచ్చాయట. కానీ ఆ ఎస్పీ ఇచ్చిన నివేదిక పైకి వెళ్లే సరికి తారుమారు అయ్యిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆ నివేదికలో పస లేకపోవడంతో డిజిపి ప్రత్యేకంగా పులివెందుల డిఎస్పీకి వచారణ బాధ్యతలు అప్పగించారట. ఆ విచారణ నివేదికలో కూడా సమగ్రమైన సమాచారం లేదట. ఇంత జరిగినా ఎందుకు ఆ నివేదికలు అంత బలహీనంగా వెళ్లాయో తెలీదు కానీ... ఈ అంశానికి సంబంధించిన వ్యవహారాన్ని పులివెందులకు చెందిన మరో నాయకుడు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేలా చేశారట. దీంతో ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో పాటు మరోసారి నిజాయితీగా విచారణ జరపాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారట.
అయితే విచారణలు ఎందుకు వీగిపోతున్నాయో... మరెందుకు ఉభయతారక ప్రయోజనంగా మారుతున్నాయో తెలియదు కానీ ... పరిపాలన పారదర్శకతను అపహాస్యం చేస్తున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎదిఎమైనా గత ప్రభుత్వంలోని తప్పులపై జరుగుతున్న విచారణలు వాటి నివేదికలపై చర్యలు లేకపోవడం, అసలు విచారణలే లేకుండా జరగకపోవడం వంటి పరిణామాలు చూస్తే భేరసారాల వ్యాపారలను మరిపిస్తున్నాయన్న అనుమానాలు ప్రజలకు కలగక మానదు. కానీ ఎట్టకేలకు సాగిన విచారణల అనంతరం ఇప్పుడు సిఐ అశోక్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.