ఉత్తరప్రదేశ్ :
ఇంట్లో దొంగలు చోరీ... బస్సులో చోరీ...బెదిరించి నగదును ఎత్తుకెళ్లిన దొంగలు... ఇప్పటి వరకు మనం ఇలాంటి వార్తలను... ఇలాంటి దొంగలనే చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిన దొంగలు తెరపైకి వచ్చారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అమెరికా-ఇజ్రాయేల్ దేశాల దాడితో ఇరాన్ తిరగబడం కారణంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. క్రూడాయిల్, ఎల్పీజీ గ్యాస్ కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడ్డ ఇండియాపైన ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్తో భారత్ లో ముడి చమురు.. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ల షార్టేజ్తో దేశంలోని ప్రధాన నగరాల్లో హాటల్స్, రెస్టారెంట్లు మూసివేసే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 500 వంట గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును దొంగలు ఎత్తుకెళ్లారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ ఎస్సీ పోలీస్ జీటీఎస్ మూర్తి వివరాల ప్రకారం.. 524 భారత్ గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్ను డ్రైవర్ రాజ్ కుమార్ సిప్రి బజార్లోని తన ఇంటి బయట పార్కింగ్ చేశాడు. తెల్లారి చూసే వరకు ట్రక్ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు బారగాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ధాబా సమీపంలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
కానీ దాంట్లో ఒక్క సిలిండర్ కూడా లేదు. అంతేకాకుండా పోలీసులకు చిక్కకుండా ట్రక్ జీపీఎస్ పరికరాలను కూడా పగొలగొట్టారు దొంగలు. ఈ కేసును చాలెంజింగ్ తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం (మార్చి 11) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గ్వాలియర్ రోడ్డులోని గ్యాస్ గిడ్డంగి సమీపంలో నిందితులు జావేద్, సుమిత్, హృతిక్, అమీర్, శుభంకర్, అభిషేక్, సురేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాతో వైరల్ కావడంతో ‘‘ఇంత టాలెంటెడ్ గా ఉన్నారేంట్రా మీరు ’’ అంటూ పన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.