* రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకునేందుకు..
* భారత్ను 'అనుమతించామన్న' అమెరికా ...
* మండిపడుతున్న ప్రతిపక్షాలు ...
*ఇదీ మన ఆత్మనిర్భర్ భారత్ అంటూ విమర్శలు ....

INDIA POLITICAL PARTES OIL WEAR :
భారతదేశంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇంధన మంటలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా ఆర్థిక శాఖ 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్టు చెయ్యడం ఈ విమర్శలకు కారణమైంది.
గతంలో రష్యా చమురు కొనుగోలు, ఇతర వాణిజ్య కారణాలు చూపుతూ భారత్పై అమెరికా 50 శాతం సుంకం విధించింది. అయితే, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు, భద్రతకు తమ తొలి ప్రాధాన్యమని భారత్ బదులిచ్చింది. ఈ రష్యన్ చమురును భారత చమురు శుద్ధి కర్మాగారాలు పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
అయితే, కొన్నిరోజుల తర్వాత భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం... రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందని, అందువల్లే ఒప్పందం కుదుర్చుకుంటున్నామని, సుంకాన్ని కూడా 18 శాతానికి తగ్గించామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత నెలలో ప్రకటించారు. అంతేకాదు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించకపోతే సుంకాలను మళ్లీ 25 శాతానికి పెంచుతామని కూడా హెచ్చరించారు.
అమెరికా పోస్టు రేపిన మంట :
"గ్లోబల్ మార్కెట్లోకి చమురు సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడటానికి, భారతీయ రిఫైనరీలు రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి అనుమతిస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపును జారీ చేస్తోంది" అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ 'ఎక్స్' పోస్టులో రాశారు. "ఇది ఉద్దేశపూర్వకంగా తీసుకున్న స్వల్పకాలిక చర్య. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన చమురు లావాదేవీలకు మాత్రమే ఇది అనుమతినిస్తుంది కాబట్టి, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదు." "అమెరికాకు భారత్ కీలక భాగస్వామి, రాబోయే రోజుల్లో దిల్లీ.. అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని ఆశిస్తున్నాం. ప్రపంచ ఇంధన వనరులపై పట్టు కోసం ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలతో ఏర్పడిన ఒత్తిడిని ఈ తాత్కాలిక చర్య తగ్గిస్తుంది" అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఇరాన్ యుద్ధం ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేయడం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న దాడులు, హార్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్ను అస్థిరపరిచాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత, హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఏ నౌకను కూడా ఈ జలసంధి మీదుగా వెళ్లనివ్వబోమని చెప్పింది. ఇది ప్రపంచంలో చాలా ముఖ్యమైన సముద్ర మార్గం. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం ఈ మార్గంలోనే వెళుతుంది. భారత్కు వచ్చే చమురు సరఫరాలో 40 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది.

ప్రతిపక్షాల దాడి :
అమెరికా ప్రకటన తర్వాత, భారత్లోని ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. "మన విదేశాంగ విధానం మన చరిత్ర, భౌగోళిక స్థానం, విలువలపై ఆధారపడి ఉండాలి, సత్యం, అహింసపై ఆధారపడి ఉండాలి. నేడు మనం చూస్తున్నది ఒక విధానం కాదు, రాజీపడిన వ్యక్తి దోపిడీ ఫలితం" అని ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. ఫిబ్రవరి 11 నాటి లోక్సభ ప్రసంగాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఆ రోజు రాహుల్ గాంధీ, "మనం ఎవరి నుంచి చమురు కొనాలో, ఎవరి నుంచి కొనకూడదో అమెరికా మనకు చెబుతోంది. మనం రష్యా నుంచి కొనాలా లేదా ఇరాన్ నుంచి కొనాలా అనేది అమెరికా నిర్ణయిస్తోంది. కానీ, మన ప్రధాని నిర్ణయించడం లేదు" అని అన్నారు. "భారతదేశం - ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. భారత్ 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతి ఇచ్చింది. ఇదీ మన ఆత్మనిర్భర్ భారత్, ఇదీ మన స్వతంత్ర విదేశీ విధానం" అని కపిల్ సిబల్ ఎక్స్ వేదికగా విమర్శించారు.
74 రోజులకు సరిపడా నిల్వలు : కేంద్రం ...
జనవరిలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని రిఫైనరీలు, నిల్వ కేంద్రాలలో దేశీయ అవసరాలకు 74 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ముడి చమురు నిల్వలు 25 రోజుల పాటు సరిపోతాయని, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులు మరో 25 రోజుల పాటు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. స్వల్పకాలిక సరఫరా అంతరాయాలను ఎదుర్కోవడానికి ఉంచే 'వ్యూహాత్మక నిల్వలకు' ఇవి అదనం. కానీ, సహజ వాయువు అతిపెద్ద సరఫరాదారు అయిన ఖతార్, ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత ఉత్పత్తిని నిలిపివేస్తామని తెలిపింది. భారత్కు కావాల్సిన 27 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)లో 40 శాతం ఖతార్ సరఫరా చేస్తోంది. గ్యాస్ దిగుమతిదారు పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ తన కస్టమర్లు, గెయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లకు సరఫరా అంతరాయం గురించి సమాచారం ఇచ్చింది.
