- సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం...
- కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ...
- Sensex Crash:
అమెరికా- ఇజ్రాయేల్- ఇరాన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. నిన్న కోలుకున్నట్లు కనిపించినా మళ్లీ ఈరోజు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్ల వరకు పడిపోయింది. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్ట వాటిల్లింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు సెన్సెక్స్ సూచీ ఏకంగా 1100 పాయింట్ల మేర పతనమైంది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ మళ్లీ 24,500 మార్క్ దిగువకు పడిపోయింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందన్న భయాలు మార్కెట్లను పడేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది అంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటన చేయడం మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ రోజు సెన్సెక్స్ ఉదయం 79,658 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఆ తర్వాత ఏ స్థాయిలోనూ కోలుకోలేదు. రోజు మొత్తం నష్టాల్లోనే కొనసాగింది. ఆరంభంలో ఓ మోస్తారు నష్టాల్లో కదలాడినా ఆ తర్వాత మరింత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఒక దశలో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 78,812 ను తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకుని 1097 పాయింట్ల నష్టంతో 78,918 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 50 సూచీ ఈరోజు 315 పాయింట్లు కోల్పోయి 24,450 వద్ద ముగిసింది. డాలురుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.74 వద్ద ఉంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్లో ఈరోజు ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ భారీగా పడిపోయాయి. బీఈఎల్, రిలయన్స్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, వంటి స్టాక్స్ లాభలు అందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 86.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే బంగారం ఔన్స్ రేటు 5082 డాలర్లకు దిగివచ్చింది.
ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ సమయం లోనే అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని అమెరికా రక్షణ మంత్రి పేర్కొనడం ఆజ్యం పోసినట్లయింది. అమెరికా ప్రెసిడెంట్ సైతం ఇరాన్ పై యుద్ధానికి టైమ్ లిమిట్ ఏదీ లేదన్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతీసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలతో క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. దీంతో దిగుమతులపై ఆధారపడే భారత్పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం, వృద్ధి భయాలు నెలకొన్నాయి.