ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయంపై దాడి..?..
ఇజ్రాయెల్ ప్రధాని ఏమయ్యారో తెలియదంటున్న ఇరాన్..
ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4లో భాగంగా ఇరాన్ దాడులు
ఇజ్రాయెల్ - ఇరాన్ వార్ :
ప్రస్తుతం ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నేరుగా యుద్ధంతో మధ్యప్రాచ్యం రగిలిపోతొంది. ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా భారీ క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. టెల్ అవీవ్లోని నెతన్యాహు కార్యాలయం, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ ఆఫీస్ లక్ష్యంగా తాము 'ఖైబర్' బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు IRGC తెలిపింది. ఈ పదో విడత దాడులు అత్యంత ఖచ్చితత్వంతో సాగాయని, ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఇవి ఛేదించాయని ఇరాన్ మీడియా పేర్కొంది..
అయితే, ఈ దాడుల వల్ల జరిగిన నష్టంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ధృవీకరణ ఇవ్వలేదు. దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు కార్యాలయంలో ఉన్నారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) టెల్ అవీవ్ పరిసరాల్లో సైరన్లు మోగాయని, కొన్ని క్షిపణులను అడ్డుకున్నామని తెలిపాయి. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్నే కాకుండా బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపు కూడా లెబనాన్ నుండి ఇజ్రాయెల్ పైకి క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం మరింత విస్తరించింది.