- పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు
- ఆయన అశ్లీల వీడియోతో సోషల్ మీడియాలో ప్రకంపనలు
- నాయుడి అనైతిక చర్యల గురించి మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం
- ఏడాదిన్నరగా ఆధారాలు చూపిస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదు
- డీప్ ఫేక్ వీడియోలంటూ పోలీస్ ఫిర్యాదు కాపాడాలని చూస్తున్నారా?
- హిందూ సమాజం, శ్రీవారి భక్తులు ఈ చర్యలను సహించదు
- ఆ తప్పుకి భవిష్యత్తులో చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుంది
* సీఎం చంద్రబాబుని తీవ్రంగా హెచ్చరించిన భూమన కరుణాకర్ రెడ్డి
- వైయస్ జగన్, ఆయన సతీమణిపై చేసిన తప్పుడు ప్రచారానికి దేవుడు వేసిన శిక్ష
- దేవుడిని రాజకీయాల్లోకి లాగే వారంతా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి
- తప్పులు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీపై నిందలు మోపడం ఆపండి
- చంద్రబాబుకి దైవ భక్తి నిజమైతే ఇప్పటికే రాజీనామా చేయించేవాడు
- పోలీసులకు ఫిర్యాదు చేయించి కాపాడాలని చూడటం ఆలయ పవిత్రతను మంటగలపడమే
తాడేపల్లి :
చంద్రబాబు నాయుడు తాను చెప్పుకున్నట్టు నిజంగా శ్రీవారి భక్తుడే అయితే అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ నాయుడిని తక్షణం టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడని చెప్పినా చంద్రబాబు నియమించాడని, ఏడాదిన్నరగా కొండపై ఆలయ పవిత్రతను మంటగలిపే కార్యక్రమాలు చేస్తున్నాడని ఆధారాలతో సహా బయటపెడుతున్నా చూస్తూ ఊరుకున్నాడని చెప్పారు. చివరికి బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చిన మరుక్షణమే ఆయనతో రాజీనామా చేయించకుండా డీప్ ఫేక్ వీడియో పేరుతో పోలీసులకు ఫిర్యాదు చేయించి కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని భూమన మండిపడ్డారు. ఈ వీడియో చూసి హిందూ సమాజం మొత్తం ఒక్కసారిగా నిర్ఘాంతపోయిందని, సోషల్ మీడియాలో శ్రీవారి భక్తులు దుమ్మెత్తి పోస్తున్నా చంద్రబాబు ఆయన్ను కాపాడాని చూడటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం దక్కితే అదృష్టంగా భావించకుండా ఆలయంలో రాజకీయాలు చేస్తూ వైయస్ జగన్ గారిని రాజకీయంగా లేకుండా చేయాలని బీఆర్ నాయుడు కుట్రలు చేశాడని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన సతీమణిపై కూడా నిందలు మోపి వారిని హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించాలని చూసిన కుట్రలకు ఆ దేవదేవుడే ఈ కఠిన శిక్ష వేశాడని విశ్లేషించారు. ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ద్వారా లబ్ధిపొందాలనుకునే వారు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.
● ఆలయ పవిత్రతను మంటగలిపాడు
అనైతిక చర్యలకు పాల్పడే వ్యక్తిని టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని బీఆర్ నాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నాటి నుంచి చెబుతూ వచ్చాం. ఆ పదవిని బీఆర్ నాయుడికి ఆ పదవిని అప్పగించడం టీటీడీ ప్రతిష్టను దిగజార్చడమేనని పలుమార్లు హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చింది. బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టాక దేవస్థానం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కొండపై ఎన్నో అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలతో సహా నిరూపించాం. ఆలయ పవిత్రతను మంటగలిపేలా ఆయన మనుష్యులు వ్యవహరిస్తున్నారని చెప్పినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టయినా అనిపించలేదు. ఇప్పుడు 70 ఏళ్లకు పైబడిన వయసులో ఆలయ చైర్మన్ బీఆర్ నాయుడు పర స్త్రీతో చనువుగా ఉంటున్న వీడియోలు సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయ్యాయి. ఇలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చంద్రబాబు ఎలా నియమించాడని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామి వారి భక్తులు అసహ్యించుకుంటున్నారు. చైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నాడా? అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
బ్రిటీష్ కాలం నుంచి చూసినా టీటీడీ పాలక మండలి చరిత్రలో ఎప్పుడూ చూడని దారుణం ఇది.
● చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడే అయితే..
వేంకటేశ్వర స్వామి తన ఇంటి దైవమని నిద్ర లేస్తానే ముందుగా స్వామివారిని స్మరించుకుంటానని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి వ్యక్తిని ఆలయ పాలక మండలి చైర్మన్గా నియమించి పెద్ద తప్పు చేశానని బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు చూశాకైనా తెలుసుకోవాలి. ఈ వీడియోలు చూసి హిందూ సమాజం ఒక్యసారిగా నిర్ఘాంతపోయింది. ఆయన బీఆర్ నాయుడు కాదు.. బీఆర్ కామ నాయుడు అని మాట్లాడుతున్నారు. చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి పదవి నుంచి తప్పుకోవాల్సందిపోయి వైయస్సార్సీపీ నాయకులు ఏఐ ద్వారా తన డీప్ ఫేక్ వీడియోలు సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టు చేశాడు. ఈ వీడియో ఏఐ టెక్నాలజీతో చేసిన వీడియో కాదని నిపుణులు నిర్ధారించిన తర్వాతనే నేను మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. కానీ తనకు ఎలాంటి అపరాధభావం లేకుండా వైయస్సార్సీపీ మీద నిందలు మోపడం అనైతికం. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కి చెందిన ఇలాంటిదే ఒక వీడియో వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రం వదిలి వెళ్లిపోయాడు. మా హయాంలో ఎస్వీబీసీ భక్తి ఛానెల్కి అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీకి చెందిన అశ్లీలమైన ఆడియో బయటకొచ్చినప్పుడు కూడా వెంటనే రాజీనామా చేయించాం. చంద్రబాబుకి నిజంగా శ్రీవారి మీద అచంచలమైన భక్తి భావమే ఉంటే తక్షణమే బీఆర్ నాయుడుతో పదవికి రాజీనామా చేయించాలి.
● బీఆర్ నాయుడు అరాచకాలకు దేవుడు వేసిన శిక్ష
దేవుడిని అడ్డం పెట్టుకుని ఏడాదిన్నర కాలంగా బీఆర్ నాయుడు చేస్తున్న అరాచకాలకు ఆ దేవదేవుడే కఠిన శిక్ష వేశాడు. వైయస్ జగన్ గారిని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించాలని చేసిన పన్నాగాలకు, ఆయన సతీమణిపై చేసిన తప్పుడు ప్రకటనలకు దేవుడు గట్టిగా బుద్ధి చెప్పాడు. బీఆర్ నాయుడి వీడియోలు, ఫొటోలు బయటకు రావడం స్వామి వారి కోపోద్రేహానికి నిదర్శనం. సీబీఐ సిట్ చార్జిషీట్ లో చేసిన సూచనలనే శిరోధార్యంగా భావించి ఏకే సింఘాల్ని బదిలీ చేసిన చంద్రబాబు.. బీఆర్ నాయుడు చేసిన ఘోరానికి ఏం శిక్ష విధిస్తాడోనని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇంకా మౌనంగా ఉన్నారంటే ఆయన చేసిన తప్పులకు మీరు మద్ధతు ఇస్తున్నారనే సందేశం ప్రజలకు ఇచ్చినట్టవుతుంది. గతంలో అచ్యుత దేవరాయులు చక్రవర్తిగా ఉన్న సమయంలో తిరుమల ప్రధాన అర్చకుడిగా ఉన్న సిరిఅప్పన్ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆలయం ముందరే వధించిన చరిత్ర గురించి చంద్రబాబు తెలుసుకోవాలి. ఇప్పటికీ ఈ విషయం ఆలయ శాసనాల్లో నిక్షిప్తమై ఉంది. కావాలంటే వెళ్లి చూసి తెలుసుకోవాలి. ఇలాంటి వ్యక్తిని క్షణంలో పదవి నుంచి తొలగించాల్సిందిబోయి చంద్రబాబు ఆయనతో పోలీసులకు ఫిర్యాదు ఇప్పించడం సిగ్గుచేటు. ఆదిలోనే ఆయన్ను తొలగించకపోతే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీడియోలు బయటకొస్తాయో ఆలోచించుకోవాలి. ఈ వీడియోపై చంద్రబాబు విచారణ చేయించాలి. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరో చెబితే వెళ్లి గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు బీఆర్ నాయుడి అశ్లీల వీడియోలకు ఏం సమాధానం చెబుతాడు?
● నిన్ననే బోర్డు మీటింగ్లో తీర్మాణం
తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను కించపరిచే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న బీఆర్ నాయుడి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్ లో తీర్మానం కూడా చేశారు. బీఆర్ నాయుడి వీడియోలు ఆలయ పవిత్రతను కించపరచడం కాదా? ఈయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పదవి నుంచి తక్షణం తొలగించాలి. దేవుడిని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ గారి రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నవారంతా ఇప్పటికైనా ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. బీఆర్ నాయుడు హిందూ ధర్మం అనే పేరుతో ఒక ఛానెల్ కూడా నడుతుపున్నాడు. దర్శనాలు చేయించి వారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బు ఈ ఛానెల్ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు స్వామి ధర్మం, నైతిక విలువల గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే.