అమరావతి :
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. గురువారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం సిటీ న్యూరో సెంటర్లో ఆయనకు చికిత్స అందుతోంది. బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక జాగ్రత్తలు తీసుకున్న కుటుంబ సభ్యులు, మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్లో ఆయనను చేర్పించారు. నిపుణులైన వైద్య బృందం ఆయనకు అత్యవసర పరీక్షలు నిర్వహించి చికిత్సను ప్రారంభించారు.
ఆరోగ్య పరిస్థితి నిలకడ
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారని మరియు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. స్ట్రోక్ ప్రభావం ఎంతవరకు ఉందనేది నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణులు మరియు పలువురు రాజకీయ ప్రముఖులు బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.
గతంలోనూ బొత్స కు ఇదే సమస్య :
గతంలోనూ మెదడులో రక్తం గడ్ఢకట్టడం వల్ల సర్జరీ కూడా జరిగింది. అనంతరం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స ఉన్న ఫలంగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను అత్యవసర చికిత్స అందించారు. దీంతో యధావిధిగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు.
వైసీపీ లేని లోటు కనిపించకుండా మండలిలో పోరాటం :
ఇప్పుడు అసెంబ్లీలో వైసీపీ లేని వెలితి కనిపించకుండా మండలిలో వైసీపీ పక్ష నేతగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను, కల్తీ లడ్డు వ్యవహారంలో ప్రశ్నిస్తూ అధికార పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన అస్వస్థతకు గురి కావడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామమనే చెప్పవచ్చు.