• సభలో చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు ఆందోళన..
• చర్చకు ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారన్న మంత్రి పయ్యావుల...
• అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, గందరగోళం.....
• చర్చే లేకుండా పయనం....
• చర్చ నుంచి తప్పించుకున్న కూటమి ...ప్రజల్లో మరింత చులకనవ్వడం ఖాయమా ?...
అమరావతి :
తిరుమల కల్తీ లడ్డుపై శాసన సభ లో ఏక పక్ష్యంగా తన వాదన చెప్పి చేతులు దులిపేసుకున్న కూటమి ...మండలిలో చర్చ అంటే మాత్రం వెనకడుగు వేసింది. లడ్డూ ప్రసాదం కల్తీపై వాస్తవాలేంటో నిగ్గు తేల్చేందుకు మండలిలో చర్చ చేపట్టాలని వైసీపీ నిత్యం మండలిలో అందోళనలు చేపట్టి అట్టుడికించింది. ఎట్టకేలకు 26న చర్చ చేపట్టాలని మండలి చైర్మన్ నిశ్చయించారు. అయితే చేపట్టాల్సిన చర్చపై కూటమి సర్కార్ వెనక్కి తగ్గింది. చర్చే జరిగితే వైసీపీ ఎలాంటి వాస్తవాలు సభ ముందుకు తెస్తుందొనన్న భయంతో వెనకడుగు వేసింది. ఇందుకు ప్రధాన కారణం కూటమి పెద్దకు సంబంధించిన డెయిరీ కావడం, చర్చ జరిగితే సంస్ద షేర్లు మరెంత పతనం అవుతాయోనన్న భయాందోళన గురి కావడం వల్ల లేనిపోని సాకులు తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టించినట్లు కనిపించింది. దీంతో ఎలాగైనా చర్చను పక్కదారి పట్టించేందుకు టీడీపీ అడ్డగోలుగా వ్యవహరించిందని మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. మండలిలో లడ్డూ ప్రసాదంపై చర్చ జరగడంపై ముందు నుంచి చెబుతున్నట్లుగా వైసీపీ అనుమానమే నిజమైంది.
రెండు రోజుల క్రితం అసెంబ్లీలో లడ్డూ ప్రసాదం కల్తీపై చర్చ జరిగింది. అసెంబ్లీకి వైసీపీ వెళ్లకపోవడంతో చర్చంతా ఏకపక్షంగా సాగింది. ఆ చర్చలో వైసీపీ ప్రభుత్వంపై, ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనేక నిరాధార ఆరోపణలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో మండలిలో వారం రోజులుగా లడ్డూ ప్రసాదం కల్తీపై చర్చ కోసం సభను వైసీపీ స్తంభింపజేస్తోంది. దీంతో మండలి చైర్మన్ మోషేన్ రాజు నేతృత్వంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. 26న చర్చించేందుకు నిర్ణయించారు. అయితే సభ నడవడానికి బీఏసీలో అంగీకరించి, ఆ తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం వుందని బొత్స సత్యనారాయణ ఆ రోజే అనుమానం వ్యక్తం చేయగా.... అలా జరగదని మంత్రులు సైతం వివరణ ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే ఇవాళ టీటీడీ లడ్డూ ప్రసాదం కల్తీలో ఎవరి పాపం ఎంత? ఇందాపూర్ డెయిరీకి ఎవరి ఉత్పత్తి సంస్థ? వాటి అవినీతికి సంబంధించి పూర్తి వివరాలతో అస్త్రశస్త్రాలతో వైసీపీ సిద్ధమై మండలికి చేరుకుంది. కానీ స్వల్పకాలిక చర్చగా మండలి ఎజెండాలో సెక్రెటరీ జనరల్ ప్రకటించారు. మరోవైపు చర్చకు ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారని మంత్రి పయ్యావుల పట్టుపట్టారు. అయితే స్వల్ప కాలిక చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని మండలి చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు మంత్రి స్టేట్మెంట్ విషయమై వైసీపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఇవాళ చర్చిస్తారని అనుకున్న అంశం.. ఆ విధంగా అసలే లేకుండా పోయింది.
ఇప్పటికే సిట్, సిబిఐ నివేదిక అనంతరం కూటమి ప్రభుత్వం ప్రజల్లో తలెత్తుకోవాలని పరిస్థితి నెలకొంది. ఇంతలో హెరిటేజ్ - ఇందాపూర్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో కూటమికి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రతిపక్షం పై బురద జల్లాలని చూస్తే అది తిరిగి కూటమి మీద పడినట్లయింది. ఎలాగైనా ఈ వివాదం నుంచి బయటపడాలని కూటమి ఎంతగా తాపత్రయపడుతున్న " మహా పాపం మిమ్మల్ని వీడేది లేదన్నట్టుగా" కల్తీ లడ్డు పాపం కూడా కూటమిని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కూటమి లడ్డుపై లేనిపోని ఆరోపణలు చేసి పాపం మూట కట్టుకుందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతుండగా.... మండలిలో చర్చ సందర్బంగా ప్రతిపక్షాన్ని దీటుగా సమాధానం చెప్పకపోతే మరింత ప్రజల్లో చులకన అవుతామన్న అభిప్రాయం ఉత్తమవుతున్నా కూటమి మాత్రం భయాందోళనకు గురై కనీసం చర్చించేందుకు కూడా ముందుకు రాలేకపోయింది. ఈ పరిణామం టీడీపీ తప్పు చేసిందనే సంకేతాలు మరింత బలంగా జనంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు.