అమరావతి :
శాసన మండలిలో హెరిటేజ్కు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చించాలంటూ వైయస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ఆ వాయిదా తీర్మానాన్ని మరోసారి మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, కూటమి సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరగడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో మండలి చైర్మన్ కొద్ది సేపు సభను వాయిదా వేశారు. అనంతరం వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ను కలిసి తమ డిమాండ్ను వివరించారు.
మండలిలో చర్చ జరగాల్సిందే : విపక్ష నేత బొత్స సత్యనారాయణ
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ అంశంపై మండలిలో తప్పనిసరిగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని అధికార పక్షం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు సంబంధం లేదు. మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి” అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని, దేవదేవుడిపై నిందలు రాకుండా ప్రభుత్వం పారదర్శకంగా చర్చకు రావాలని ఆయన కోరారు.
నెయ్యి ధరలపై అనుమానాలు :
బొత్స సత్యనారాయణ చిట్చాట్లో ఇందాపూర్ నెయ్యి ధరలపై అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ మార్కెట్లో ఇందాపూర్ ప్యూర్ నెయ్యి రూ.560కు లభిస్తోందని, అదే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానంకు (టీటీడీ)కి రూ.658 చొప్పున సరఫరా చేస్తున్నారని తెలిపారు. “టీటీడీకి రూ.658కి అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే, బయట రూ.560కి దొరికేది కల్తీనా? ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా? లేక దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా?” అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని, మండలిలో పూర్తి స్థాయి చర్చ జరగాల్సిందేనని బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు.