ఢిల్లీ :
తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్యణ్య స్వామి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ దర్యాప్తు చేసి నివేదిక అందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడంపై స్వామి ఈ పిటీషన్ దాఖలు చేశారు.
సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్ ను...
సుప్రీంకోర్టుకు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుబ్రహ్మణ్య స్వామి తప్పుపడుతూ ఈ పిటీషన్ వేశారు. ఈ కమిటీ విచారణను నిలుపుదల చేయాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడంతో రేపు విచారణకు రానుందని తెలిసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో దోషులను తేల్చేందుకు ఇప్పటికే సీబీఐ సిట్ (SIT) ఇప్పటికే విచారణ జరిపింది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించడం కొత్త వివాదానికి తెరలేపింది. ఈ కమిటీ నియామకాన్ని సవాలు చేస్తూ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ పర్యవేక్షణలోని సిట్ (SIT) లోతుగా విచారణ జరిపింది. నివేదిక ఇచ్చింది. అలాంటప్పుడు మళ్లీ ప్రభుత్వం ఏకసభ్య కమిటీని వేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ ఏకసభ్య కమిటీ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని చూస్తోందని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విచారణలను వాడుకుంటున్నారని స్వామి ఆరోపించారు. తన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చి, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను నిష్పక్షపాతంగా తేల్చాలని కోరారు.
సుబ్రమణ్య స్వామి గత చరిత్రను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్వామి తిరుమల అంశాలపై అత్యంత వేగంగా స్పందిస్తుంటారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రమణ దీక్షితుల ఉదంతం మొదలుకొని, టీటీడీ ఆస్తుల వేలం వరకు ప్రతి విషయంలోనూ ఆయన కోర్టు మెట్లు ఎక్కి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది.