నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం శ్రీలంక వైపుగా కదులుతోంది.. ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.
ఈ అల్పపీడనం కొనసాగుతుండగానే.. ఈ నెల 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని వాతావరణ మోడళ్లు కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఈ అల్పపీడనం ఈ నెల 23 నాటికి శ్రీలంక తీరం వైపు కదులుతుందని అంచనాలు ఉన్నాయి.
బంగాళాఖాతంలో శనివారం ఏర్పడే ఈ అల్పపీడనంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఈ నెల 21 , 22, 23 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ శనివారం నుంచి మూడు రోజులు రాయలసీమ జిల్లాల్లో.. అలాగే ఈ నెల 22 నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అంటున్నారు.
ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరుగుతోంది.. బుధవారం కర్నూలులో రాష్ట్రంలోనే అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం రాత్రి నుంచి ఉదయం వరకు చలి, పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. అయితే పగటి పూట మాత్రం ఎండల తీవ్రత కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది.. ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండల పరిస్థితి ఇలా ఉంటే.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.