అమరావతి :
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కె.అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్తో పాటు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్తో పాటు అధికారులు, మంత్రుల బృందం సచివాలయానికి బయల్దేరారు.

ఈ పర్యటనలో బిల్ గేట్స్తో పాటు ఫౌండేషన్కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం కూడా సచివాలయానికి చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది.

ఈ సందర్భంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ను సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, అమలు తీరుతో పాటు సాధిస్తున్న ఫలితాలను గేట్స్కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం బిల్ గేట్స్కు ప్రత్యేకంగా వివరించనున్నట్లు సమాచారం.