ఈ యేడాది బడ్జెట్ తో ..సూపర్ సిక్స్ హామీల్లో.. యువత, మహిళలకు ఎగనామమే...
-పి4 తో పీటముడి ....
-వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాకా పెన్షన్ల పెంపుపై తొలి యేడాదే ఒక రత్నం ఉడిపోయిందని టిడిపి విమర్శలు...
-మరి ఇప్పుడు కూటమి బౌండరీ లైన్ దాటకుండానే సిక్స్ కింద వేసుకుందా అంటూ ప్రశ్నలు....
అమరావతి :
సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపి, జనసేన పార్టీలు మేం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రచారాన్ని అదరగొట్టాయి. కానీ అధికారంలోకి వచ్చాకా కొన్ని పథకాలు అమలుకు నొచుకున్నా... మరికొన్ని పథకాలు ఇంకా అమలుకు నొచుకోలేదు. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పేరిట ఆరు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ సూపర్ సిక్స్పై నాడు ఆ పార్టీ ముఖ్య నేతలు ఎన్నికల సమయంలో ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదు.మేనిఫెస్టో విడుదల సభలో అప్పట్లో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సిద్ధార్ధ్ నాథ్ పాల్గొన్నప్పటికీ మేనిఫెస్టో ప్రతిని మాత్రం ఆయన పట్టుకోలేదు.కాగా, గతేడాది సెప్టెంబర్ 10న అనంతపురంలో ''సూపర్ సిక్స్ సూపర్ హిట్'' పేరిట ఎన్డీయే కూటమి పార్టీల తొలి ఉమ్మడి సభను నిర్వహించారు. కానీ ఈ యేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరు చూస్తే యువతకు, మహిళలకు అమలు చేస్తామని చెప్పిన 2 పథకాలకు మాత్రం ఎగనామమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాల్లో అమలుకు నొచుకోని పథకాలు తీరు చూస్తే....

1. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల రూ.1500 ఇస్తామన్న హామీ :
రాష్ర్టంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల రూ.1500 ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. కానీ ఈ యేడాది బడ్జెట్ లోను మహిళలకు ఇచ్చిన హామీని ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఈ పథకం అధికారంలోకి వచ్చాకా అమలు చేస్తుందని మహిళలందరు పెద్ద అశే పెంచుకున్నారు. సూపర్ సిక్స్లో.. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్ధికీ 13 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలను కూటమి అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం–2.0 పథకాన్ని 2024 చివరి నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే నగదు బదలీ పథకమైన మహిళలకు ప్రతి నెలా భృతిపై ప్రభుత్వం ఎక్కడా స్పష్టతనివ్వడం లేదు.

2. యువతకు నిరుద్యోగ భృతి :
కూటమి సూపర్ సిక్స్ హామీల్లో మరో నగదు బదిలీ పథకమైన యువతకు నిరుద్యోగ భృతిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశామనీ, నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే 8 లక్షల మంది ఉద్యోగాలకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మిగిలిన నిరుద్యోగ యువతకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. ఈ బడ్జెట్ లోను ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఈ పథకానికి ప్రభుత్వం ఎగనామమేనా అన్న ప్రచారం సాగుతుంది.

* ఆ రెండింటి బదులు p4 తో ఎక్కువే చేస్తున్నామంటున్న ప్రభుత్వం :
నిరుద్యోగులకు రూ.3000 భృతి, మహిళలకు రూ.1500 భృతిపై ఎక్కడా మాట్లాడని కూటమి ప్రభుత్వం.. ఆ రెండింటి బదులు ఫించన్ల పెంపు, మెగా డీఎస్సీ పోస్టుల భర్తీని సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చింది. అంతేకాకుండా సూపర్ సిక్స్లో పేర్కొన్న ఆరు హామీలే కాదు.. ‘ పీ–4’ ద్వారా అంతకంటే ఎక్కువే ప్రభుత్వం చేస్తోందని చెబుతొంది. మహిళకు నెలకు రూ. 1500 ఇవ్వడం కంటే ఆ కుటుంబాన్ని మొత్తం దత్తత తీసుకుని వారికి ఆర్ధిక చేయూతనిచ్చే విధంగా పీ–4 పథకం ప్రవేశపెట్టామని, ఆ హామీ కంటే బెటర్గా పీ–4 ఉపయోగపడుతుందని, పీ–4తో రాష్ట్రంలోని పేదల ఇళ్లల్లో సరికొత్త వెలుగులు వస్తాయని వ్యాఖ్యానిస్తొంది.
ఇక నిరుద్యోగ భృతిపై కూడా ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఆ భృతి కంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా చేస్తున్నామని చెబుతొంది.
అంటే ఈ రెండు పథకాలకు ఇక ఎగనామమేనా ?
ఎన్నికల ముందు ఎంతో అర్బాటంగా ప్రచారం చేసుకున్న సూపర్ సిక్స్ పథకాల్లో రెండు పథకాలకు ప్రభుత్వం ఇక ఎగనమమే అన్న ప్రచారం జోరందుకుంది. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చాకా పెన్షన్లు పెంచుతామని చెప్పి... అధికారంలోకి వచ్చాకా విడతల వారిగా పెంచుతామని చెప్పడంతో ... అధికారంలోకి వచ్చిన తొలి యేడాదే నవరత్నాల్లోని ఒక రత్నం ఉడిపోయిందని ప్రచారం ఉదరగొట్టింది. మరి ఇప్పుడు కూటమి సర్కార్ ఎన్ని బౌండరీ లైన్ దాటని వాటిని కూడా సిక్స్ ల కింద నమోదు చేసుకుని అన్ని పథకాలు అమలు చేశామని చెబుతుందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.