కడప :
కడప నగరంలోని కందిపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన దళిత కుటుంబ ఇంటి కూల్చివేత తమకు ఎలాంటి సంబంధం లేదన్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే అని
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. నారాయణ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల నేత జేవి రమణ తీవ్రంగా విమర్శించారు.
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, న్యాయ పోరాట దీక్ష శిబిరం వద్ద బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన 8వ రోజు రిలే దీక్షలను శనివారం నారాయణరెడ్డి, జేవి రమణలు ప్రారంభించారు. దీక్షా శిబిరం వద్ద లేచి నిలబడి చేతులు పైకి ఎత్తి బి.నారాయణ గారు భారత రాజ్యాంగ పీఠిక పఠనంతో ప్రతిజ్ఞ చేస్తూ రాజ్యాంగ విలువల తమ అంకితభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేదని చెప్పడం సరిపోదని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రజాప్రతినిధిగా బాధిత కుటుంబానికి అండగా నిలవడం ఎమ్మెల్యే గారి నైతిక, ప్రజాస్వామ్య బాధ్యత అని వారు స్పష్టం చేశారు. దళిత కుటుంబంపై జరిగిన దాడి కేవలం ఒక ప్రైవేట్ వివాదం కాదని, ఇది రాజ్యాంగ విలువలపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి సమయంలో జెసిబిలతో ఇల్లు కూల్చివేయడం, మహిళలు, వృద్ధులు ఉన్న కుటుంబాన్ని వీధిన పడేయడం అత్యంత దారుణమని అన్నారు. ఇటువంటి ఘటనల్లో ప్రజాప్రతినిధులు మౌనం పాటిస్తే, అది దాడులను ప్రోత్సహించినట్టే అవుతుందని హెచ్చరించారు. ఈ ఘటనపై వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ )ఏర్పాటు చేసి నిష్పక్షపాత విచారణ జరపాలని, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కఠిన సెక్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ రక్షణ, ప్రభుత్వ పరిహారం, ఇల్లు పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికైనా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలిసి పరామర్శించి, న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు. అలా చేయకపోతే కలసి వచ్చే పార్టీలు,ప్రజాసంఘాలతో అఖిలపక్షంగా కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.బాధిత కుటుంబ సభ్యులు సట్టి విద్యారణ్య స్వామి,సట్టి అనూష,మాలమహానాడు జిల్లా అధ్యక్షులు జేష్టాది భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు బెరీ అహారోన్, రాజశేఖర్, రాజ, ఎలీషా,ఓబులేసు, శ్రీధర్ లు దీక్షల్లో కూర్చున్నారు. సిపిఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షల ప్రారంభ కార్యక్రమంలో పలురువుల నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు భారవి, భాస్కర్, వనజ, మాధవి తదితరులు పాల్గొన్నారు.