విజయవాడ:
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడల్లా పరస్పర పొగడ్తలతోనే సరిపుచ్చుతోందని; 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ బడాయి బడ్జెట్గా (సెల్ఫ్ డబ్బా) చెప్పవచ్చునని; ఇందులో సంక్షేమం, అభివృద్ధికి సమతుల్యత లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. నిత్యం చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, లోకేశ్ పొగడ్తలతోనే సరిపోతోందని, బడ్జెట్ అంకెల గారడిగా మారిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఓటాన్ అకౌంట్ తోపాటు రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఎన్నికల్లో సూపర్ 6 హామీల అమలుకు ఇంకా కదలిక లేకపోయిందని, మిగిలిన హామీల అంశాల ప్రస్తావనేలేదని పేర్కొన్నారు. నిరుద్యోగులను, మహిళలను, రైతులను, ఉద్యోగులను ఈ బడ్జెట్ మోసగించిందన్నారు. ప్రధానంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా మహిళలకు కేటాయించే. రూ.1500 ప్రస్తావనే లేదన్నారు. నిరుద్యోగభృతిగానీ, లేదా ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఈ రెండేళ్లల్లో 8 లక్షల ఉద్యోగాల హామీకి ఎక్కడా చోటు లేకపోయిందన్నారు. జాబ్ క్యాలెండరు ఎక్కడని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఈ ప్రభుత్వం నిరాశ పరిచిందని, 12వ పీఆర్సీపై కేటాయింపులు లేవని, ఐఆర్ చేయలేదని పేర్కొన్నారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఐఆర్ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉద్యోగులను మోసగించిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.9,906 కోట్లు ఘనంగా కేటాయించామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటూనే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూటమి హయాంలోనే పైపులైన్లు వేసినట్లుగా డబ్బాలు కొట్టుకోవడం తగదన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని చెబుతున్న ఈ కూటమి లెక్కలు గమనిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల పెన్షన్లు ఉండగా, ప్రస్తుతం అవి 60 లక్షలకు కుదించబడ్డాయని, మిగిలిన 7 లక్షల కోత ఎందుకు జరిగిందని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో భాగంగా 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అమలుపైనా బడ్జెట్లో కేటాయింపులు చోటు చేసుకోలేదన్నారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయింపు గురించి ప్రస్తావన లేదన్నారు. సంక్షేమానికి 17.3 శాతం నుండి 16 శాతానికి తగ్గిందని, ఎస్సీ, ఎస్టీ స・న్కు నిధుల కేటాయింపు లేదని తెలిపారు. ఈ 20 నెలల్లోనే 3, 10 లక్షల కోట్లకుపైగా ప్రభుత్వం అప్పులు చేయగా వచ్చే ఏడాదికి మరో లక్ష కోట్ల అప్పులు తెచ్చేందుకు మాత్రం ప్రణాళిక రూపొందించడాన్ని బట్టి రాష్ట్రాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సంపదను సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా కేవలం అప్పులతోనే పాలన కొనసాగిస్తోందని ఎద్దేవా చేశారు. రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే దానికి పూర్తిగా కేటాయియించకుండా విస్మరించారని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల కింద ఎస్సీ, ఎస్టీలకు రావాలసిన రాయితీలపై స్పందించలేదన్నారు. రైతులు, కౌలు రైతుల ఆశలను నీరుగార్చారన్నారు. ప్రభుత్వ రంగాలను అభివృద్ధి చేయడం చేతగాని ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్ (పిపిపి) పేరుతో ప్రైవేటు రంగాన్ని పట్టుకు వేలాడుతుందని విమర్శించారు. ఇంటికొక పారిశ్రామికవేత్త నినాదం ఆశాజనకంగా లేకపోగా చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం లేదన్నారు. రాష్ట్రంలోని వెలిగొండ, హంద్రీనీవా, వంశధార తదితర ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు పెంచాలన్నారు. పోలవరం నిర్వాసితులకు ఎంత కేటాయించారో స్పష్టతలేదని, పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయ్యిందంటూ ఇప్పటిదాకా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 60 శాతమే పూర్తయిందని చెప్పడం వారి వాగాడంబరాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. విద్యుత్ రంగానికి కేటాయింపులు రూ.15 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు తగ్గించారని వివరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికే బడ్జెట్లో నిధులు కోత పెట్టినట్లు కనిపిస్తోందని, విద్యారంగానికి పెద్ద పీట వేస్తామంటూ గొప్పలు చెప్పిన చంద్రబాబు సర్కార్ మొత్తం బడ్జెట్లో విద్యకు 10.8 శాతం నుంచి 10.5 శాతానికి కేటాయింపులు తగ్గించిందని, ఇప్పటికే 1400 పాఠశాలలను మూసివేశారన్నారు.
