ఢిల్లీ :
కడప జిల్లాలో రైళ్ల నిలుపుదలకు సంబంధించి కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా లోని కమలాపురం స్టేషన్ లో చెన్నై - ముంబై మెయిల్ ఎక్సప్రెస్ రైలు నిలుపుదలతో పాటు మరికొన్ని ఎక్సప్రెస్ రైళ్లు కొండాపురం, యర్రగుంట్ల లో నిలిపేలా చర్యలు చేపట్టాలని కోరారు. కమలాపురం నియోజకవర్గ కేంద్రం కావడంతో పాటు పక్కనే ఉన్న ప్రధాన వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరు, ఇతర చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముంబై, చెన్నై వెళ్లాలంటే దూర ప్రాంతాల స్టేషన్లకు వెళ్లి ఎక్కాల్సి వస్తుందని, తక్షణం రైలు అపేలా చూడాలని విన్నవించారు. అలాగే జిల్లా లోని రైల్వే సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టి, రైళ్లు అగేలా చూస్తానని హామీ ఇచ్చారు.