రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గలమెత్తిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి...
* కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలి..
*కడప–బెంగుళూరు రైల్వే లైన్ త్వరితగతిన పూర్తి చేయాలి..
*మెడికల్ కాలేజీలు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వద్దు ...
*రాష్ట్రంలోని అప్పుల విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లిన ఎంపి
*పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు పెంచాలి ....
DELHI :
రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గలమెత్తిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి. ఇందులో రాష్ర్టంలోని ప్రధాన సమస్యలు, హామీలు, అభివృద్దికి సంబంధించిన అంశాలతో పాటు రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అప్పులు, విభజన చట్టంలోని అంశాలను కూడా అయన పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఇందులో విభజన చట్టంలోని కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు, కడప–బెంగుళూరు రైల్వే లైన్ త్వరితగతిన పూర్తి చేయాలని, శ్రీశైలం రిజర్వాయర్ వద్ద నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పర్యావరణ అనుమతులను మళ్లీ ఓ సారి పునఃపరిశీలించాలని, పోలవరం ప్రాజెక్టు 194 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో, 45.72 మీటర్ల ఎత్తులో రూ.55వేల కోట్లతో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టినందున నిధులు కేంద్రం సమకూర్చాలని, రాష్ట్రంలోని అప్పుల విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోరుతూ... ఈ 20 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా వైఎస్ జగన్ చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో మిగిలిన 10 మెడికల్కాలేజీలకు రూ.5వేల కోట్లు కూడా వెచ్చించలేకపోతోందని సభ దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని, తక్షణం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేసి స్టీల్ ప్లాంటుకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. అయన పార్లమెంట్ లో ప్రస్తావించిన అంశాలు కింద విధంగా ఉన్నాయి.
1. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలి :
– ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2004 ప్రకారం ఇచ్చిన హామీలో భాగంగా కడపలో స్టీల్ ఏర్పాటు చేయాలి.
– ఈ అంశాన్ని అనేక సార్లు ఈ సభ దృష్టికి, తద్వార ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం.
– మరోసారి కేంద్రం కడపలో విభజన చట్టం ప్రకారం స్టీల్ ప్లాంటు నిర్మాణం చేపట్టి ప్రభుత్వం తానిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
2. కడప–బెంగుళూరు రైల్వే లైన్ త్వరితగతిన పూర్తి చేయాలి:
– కడప–బెంగుళూరు రైల్వే లైనును 2010లో రూ.2700 కోట్లతో మంజూరు చేశారు.
– కానీ ఇప్పటి వరకూ కేవలం 10 «శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
– ప్రభుత్వం ఈ రైల్వే లైనును పూర్తి చేయడానికి కావాల్సిన నిధులన్నీ విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలి.
– ఈ రైల్వే లైను మంజూరు చేసే సమయంలో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వ వాటాలు 50:50 గా ఉన్నాయి.
– కానీ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. అందుకే 100 శాతం నిధులు కేంద్రమే భరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం.
3. రాయలసీమ లిఫ్ట్:
– శ్రీశైలం రిజర్వాయర్ వద్ద నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పర్యావరణ అనుమతులను మళ్లీ ఓ సారి పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– 2025 మార్చిలో ఇప్పుడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పర్యావరణ అనుమతులను ఈసీ తిరస్కరించింది.
4. పోలవరం:
– రాష్ట్ర బడ్జెట్లో పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు చాలా తక్కువగా ఉంది.
– పోలవరం ప్రాజెక్టు 194 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో, 45.72 మీటర్ల ఎత్తులో రూ.55వేల కోట్లతో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారనేది మనందరికీ తెలుసు
– జాతీయ ప్రాజెక్టుగా ఈ పథకానికి వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంది.
– ఈ 2026–27 బడ్జెట్లో కేవలం రూ. 3320 కోట్లు మాత్రమే కేటాయించారు.
– బడ్జెట్ సమర్పించే సందర్భంలో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ. 30,436 కోట్లుగా చూపించారు.
– అంతేకాకుండా దాని ఎత్తును కూడా 41.15 మీటర్లకు కుదించినట్లు స్పష్టమవుతోంది.
– దీంతో కేంద్రం ఇంకా చెల్లించాల్సింది రూ.12,157 కోట్లుగా పేర్కొన్నారు.
– కానీ 41.15 మీటర్లలో కేవలం 75 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచుకోగలం.
– ఇలా చేస్తే ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నెరవేరకుండా పోతుంది.
– మేం వైఎస్సార్సీపీ తరఫున ఈ ప్రాజెక్టును 194 టీఎంసీల సామర్ధ్యంతో 45.72 మీటర్ల ఎత్తులో గతంలో మంజూరు చేసిన రూ.55వేల కోట్లతో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం.
– మంజూరు చేసిన రూ.55వేల కోట్లలో ఏ మాత్రం తగ్గించిన రాష్ట్రంలోని కోట్లాది మంది రైతుల జీవితాలపై ప్రభావితం చూపుతుంది.
5. అప్పుల కుప్పగా రాష్ట్రం:
– రాష్ట్రంలోని అప్పుల విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నాను.
– గత వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో అంటే 2019–24లో అన్ని అప్పులు కలిపి రూ. 3.32 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి.
– కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ. 3.20 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చింది.
– వాస్తవానికి అన్ని అప్పులు కలిసి రాష్ట్ర జీడీపీలో 3.5 శాతాన్ని మించకూడదు.
– కానీ 2014–19 మధ్యలో తమ పరిమితి దాటి అప్పటి ప్రభుత్వం రూ.17వేల కోట్లు అదనంగా అప్పు తెచ్చింది. ఇది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రుణ పరిమితిని తగ్గించేలా మారింది.
– ఇప్పుడున్న ప్రభుత్వం పరిమితిలు దాటి చేస్తున్న అప్పులు ఇలానే కొనసాగితే రానున్న ప్రభుత్వం కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది.
– అంతేకాకుండా ఇప్పటి ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ అప్పులు కూడా తీసుకొస్తోంది. మే 2025లో ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్ల అప్పులు తీసుకొచ్చింది.
– ఏపీఎండీసీ ద్వారా తెచ్చిన ఈ అప్పులో ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తి రాష్ట్ర సంచయిత నిధి నుంచి నేరుగా తన డబ్బు డ్రా చేసుకునేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం దారుణం. ఇది రాజ్యాంగ విరుద్ధం.
– 2025 డిసెంబర్లో రూ. 5,750 కోట్లు ఏపీఎస్బీసీఎల్ బాండ్స్ ద్వారా అప్పు తెచ్చారు.
– ఇదే విధంగా 2022–23 మధ్యలో ఏపీఎస్బీసీఎల్ ద్వారా మేం అప్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ ఓ సర్క్యులర్ని కూడా విడుదల చేసింది.
– కానీ ఇప్పుడు అదే విధంగా అప్పు తీసుకువస్తున్నారు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో బడ్జెట్ మొత్తం అప్పులు చెల్లించడానికే సరిపోతుంది. ఆ తర్వాత ఉద్యోగుల జీతాలు, పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం కష్టసాధ్యంగా మారుతుంది. ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను
6. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు:
– ఈ 20 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా వైఎస్ జగన్ చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో మిగిలిన 10 మెడికల్కాలేజీలకు రూ.5వేల కోట్లు మాత్రం వెచ్చించలేకపోతోంది.
– అంతేకాదు...ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు కూడా పిలిచారు.
– ప్రైవేటీకరణ పేదలపై నేరుగా ప్రభావం చూపడంతో పాటు ఆ ఆస్పత్రుల్లో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని పొందలేని పరిస్థితి ఎదురవుతోంది.
7. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు:
– విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలి..అదే విధంగా ఆ స్టీల్ ప్లాంటుకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా విడుదల చేయాలని కోరుతున్నాం.
– ఈ బడ్జెట్లో వీబీజీరామ్ స్కీం (ఉపాధి హామీ) కింద రూ.96 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేని కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ నిధులు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం ఖర్చు చేసే విధంగా కేటాయించాలని కోరుతున్నాం.