తిరుమల :
తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పని చేస్తానని టిటిడి నూతన ఈవో, ఆంధ్రప్రదేశ్ సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. టిటిడి నూతన ఈవోగా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగించింది. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారుల అనుభవాన్ని గౌరవిస్తూ, ప్రస్తుతం సేవలందిస్తున్న అధికారులూ, ఉద్యోగుల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, ఉద్యోగులందరి సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. శ్రీవారిపై భక్తులకు ఉన్న అపారమైన భక్తిభావం, నమ్మకం ఏమాత్రం సన్నగిల్లకుండా కాపాడటమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు సేవచేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.