గంజాయి, గుట్కా, మట్కా తదితర కేసుల్లో నిందితులను..... ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్టీలకు చెందిన వారిని రోడ్లపై నడిపిస్తూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ తీసుకెళ్లడం ఇటీవల కాలంలో పోలీసులకు అలవాటుగా మారింది. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు అటువంటి పోలీసులపై ఎపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను రోడ్లపై నడిపిస్తు తీసుకెళ్లడం ఎంటని ప్రశ్నించింది. ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని జంతువుల్ని, కోళ్లని బలిచ్చిన కారణంగా కూడా పోలీసులు పలుచోట్ల కేసులు నమోదు చేశారు. అలాంటి కేసుల్లో నిందితుల్ని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై నడిపిస్తూ అవమానించారు. నిందితులను నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై నడిపిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో సొసైటీ ఫర్ సివిల్ రైట్స్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ నిర్వాహకుడు పరసా సురేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ పై ఈ రోజు ఎపీ హైకోర్టులో చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్, ప్రభుత్వం తరపు ఏజీ దొమ్మాలపాటి రమేశ్ వాదనలు వినిపించారు. నిందితుల హక్కుకు భంగం కలిగించేలా, ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరించడం తీవ్ర అక్షేపనీయమని జడ శ్రావణ్ గట్టిగా వాదనలు వినిపించారు. అయితే కోవూరులో మాత్రమే నిందితుల్ని తీసుకెళుతున్న వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో నడిపించుకెళ్లినట్టు ప్రభుత్వం తరపు ఏజీ దొమ్మాలపాటి రమేశ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ వాదనలో నిజం లేదంటూ, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇలాంటివే పునరావృతం అయ్యాయని ఆధారాలతో సహా కోర్టు ముందు జడ శ్రావణ్ ఉంచారు. దీంతో ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అబద్ధాలు చెబుతున్నారనిపిస్తోందని ఏజీని ఉద్దేశించి న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో ప్రజలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏం బాగాలేదని, పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి పునరావృతం కావద్దని హెచ్చరించింది. మరోసారి పునరావృతం అయితే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు పోలీసులకు హైకోర్టు షాకిచ్చినట్లయ్యింది.