-సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా నీటి అవసరాలు తీరాలంటే ...
-రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధించాల్సిందే ...
-సీమ ఎత్తిపోతల పథకం సాధించలేకపోతే తాగునీటికి కష్టకాలమే ...
-అందరికి వెన్నుపోటు పోడవటం చంద్రబాబుకు అలవాటే ...
-ఛలో పోతిరెడ్డిపాడుకు ఇంటికొకరు తరలిరండి ...

కడప :
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధించి తీరాల్సిందేనని, ఈ పథకం సాధనే లక్ష్యంగా ఈ నెల 5వ తేదిన నిర్వహించినున్న ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం ద్వారా చంద్రబాబునాయుడులో వణుకు రావాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి హెచ్చరించారు. కడప జిల్లా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న అయన ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం పోష్టర్ ను జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ చార్జులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం ఈ నెల 5వ తేదిన నంధ్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద అన్ని రాజకీయ పార్టీలతో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ భారీ బహిరంగ సభకు రాయలసీమ నాలుగు జిల్లాలు కాకుండా నెల్లూరు ప్రకాశం అందరం కలిసి పెద్ద ఎత్తున జరుగుతున్న అన్యాయాన్ని చాటిచెబుతామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలను మోసం మోసం చేయడం అలవాటేనని, తెలంగాణ అసెంబ్లీలో స్వయానా సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయమని చంద్రబాబు నాయుడును అడిగితే ఆపేశారని గొప్పగా చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయినా ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదన్నారు.
రాయలసీమకు మాత్రం దారుణమైన ద్రోహం చేశారని, కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచితే పట్టించుకోలేదని, ఆపాలన్న ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఉద్యమించి ఆపాల్సిన సమయంలో అలసత్వం వహించారని, ఫలితంగా ఇప్పుడు కర్ణాటకలో ప్రాజెక్టులు నిండితే గానీ మనకు నీళ్లు రాని పరిస్ధితి తలెత్తిందన్నారు. గతంలో 150 రోజులు పాటు నదుల్లో నీరు ప్రవహిస్తుండగా, ఇప్పుడు 30 రోజులకు మించి రావడం లేదన్నారు. ఈ పరిస్ధితుల్లో కూడా తెలంగాణాలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి, పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని శ్రీశైలంలో 800 అడుగుల లోగానే నీళ్లు పోసుకునేలా ప్రాజెక్టులు కట్టారన్నారు. అయినా చంద్రబాబు పట్టించుకున్న పరిస్థితి లేదని, 2018 లోగా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్ని ఇప్పుడు చివరి దశకు చేరుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యితే రాయలసీమకు న్నీళ్లు వచ్చే పరిస్థితి లేనందున గత వైసిపి ప్రభుత్వం త్వరపడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి మూడేళ్లలోనే యుద్దప్రాతిపదికన 80 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాజెక్టులకు కలిపి 101 టీఎంసీ నీళ్లను తరలించుకోవాల్సిన అవసరం ఉందని, అందువల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందన్నారు. మూడేళ్లలోనే 80 శాతం పనులు పూర్తిచేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని, ఏదైనా ఒక యజ్ఞం చేసేటప్పుడు పైనుంచి రాక్షసులు ఆటంకాలు కల్పించినట్లుగా చంద్రబాబు నాయుడు ఆటంకాలు కల్పించారని, ప్రభుత్వ మారిన తర్వాత మిగిలిన 20 శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు. ఇప్పుడు కాలువల ద్వారా ప్రతిరోజు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకుని పరిస్థితి లేదు కాబట్టి తక్కువ రోజుల్లోనే నీటిని తీసుకోవాలన్నా..... రాయలసీమలో కట్టిన ప్రాజెక్టులకు నీళ్లు రావాలన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాల్సిందేనని, ఇప్పుడున్న ప్రాజెక్టులు చెరువులు నింపుకోవడానికి కూడా పనికిరావన్నారు. రాయలసీమ, నెల్లూరు ప్రకాశం జిల్లాలను చంద్రబాబు నాయుడు తాకట్టుపెట్టే పని తప్ప మరోకటి లేదని, అందువల్లే వైసీపీ ప్రతిపక్ష పార్టీగా భవిష్యత్తు తరాల కోసం ఉద్యమిస్తొందని, ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి తరలి రావాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతల మెడలు వంచైనా రాయలసీమ పథకాలు సాధిస్తామని, చంద్రబాబు నాయుడుకు బుద్ధి వచ్చేంత వరకు ఉద్యమిస్తామని... ఈ ప్రజా ఉద్యమాన్ని చూసే చంద్రబాబులో వణుకు రావడం ఖాయమన్నారు.