* జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కామెంట్స్ నేపధ్యంలో ...
* భేటికి పెరిగిన ప్రాధాన్యత ...
అమరావతి :
ఎపి సిఎం చంద్రబాబుతో మరి కొద్దిసేపట్లో బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ భేటి కానున్నారు. ఉండవల్లిలోని సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించిన అనంతరం బిజేపి ఛీఫ్ మాధవ్ భేటి కానున్నట్లు సమాచారం. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వరుసగా ప్రభుత్వంపై చేస్తున్న అరోపణలు, విమర్శల నేపధ్యంలో ఈ భేటి ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

తిరుపతిలో బిజేపి సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూటమి పాలన కమ్మగా వుందని, సిఎం అందరిని సమానంగా చూసుకోవాలని కామెంట్స్ చేయగా, ఆ కామెంట్స్ పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సమక్షంలోనే కమ్మని పాలనంటూ ఆదినారాయణరెడ్డి మాట్లాడంతో పెద్ద చర్చకే దారితీశాయి. దీంతో కూటమి పాలనపై ఆదినారాయణరెడ్డి విమర్శలు చెయ్యడాన్ని మాత్రం సిఎం చంద్రబాబునాయుడు సీరియస్ గానే తీసుకున్నారు. అయనను తన చాంబర్ కు పిలిపించుకుని మాట్లాడారు. అప్పటితో ఎమ్మెల్యే ఆది వ్యవహారం సద్దుమణిగిందనుకున్నారు.
కానీ గడచిన రెండు రోజుల క్రితం జమ్మలమడుగులో నిర్వహించిన పార్టీ ఆవిర్బావ దినోత్సవంలో.. తనను పార్టీ పరంగా ఇబ్బంది పెడుతున్నారని, ఈ కారణంగా తాను బాధపడుతున్నట్టు ఆయన బహిరంగ సభలో వాపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా సొంత పార్టీలోనే సెగ పెడుతున్నారంటూ ప్రస్తావించారు. ఇందుకు ప్రధాన కారణం అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ చాపకింద నీరులా తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి , అయన వర్గీయులు చాలా కాలంగా అరోపిస్తు వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొదట్లో టిడిపిపై విమర్శలు చెయ్యగా, ఇప్పుడు టిడిపితో పాటు బిజేపిలోని నాయకులు కూడా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించడం దుమారం రేపుతుంది.
మొత్తం మీద కూటమికి కొరకరానీ కొయ్యగా మారిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యవహారంపై మాట్లాడేందుకే ఇప్పుడు సిఎం చంద్రబాబుతో బిజేపి ఛీఫ్ మాధవ్ భేటి అవుతున్నారా అంటూ చర్చ నడుస్తుంది. మరి ఈ భటి అనంతరం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.