నోటీసులు జారీ చేసిన లోక్సభ సచివాలయం...
మోడీ, ఓం బిర్లాలపై AI వీడియో ప్రచారం చేశారని నోటీసులు..
మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశం...

DELHI :
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపధ్యంలో అధికార ఎన్టీయూ కూడా ప్రతీకార చర్యలకు సిద్దమైనట్లు సంకేతలిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది కాంగ్రెస్ నేతలకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను లోక్సభ సచివాలయం జారీ చేసింది. ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలపై AI వీడియో ప్రచారం చేశారన్న కారణంగా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని లోక్సభ సచివాలయం ఆదేశించింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో 9 మందిలో కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన కీలక నేతలు ఉన్నారు. వీరిలో రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ కూడా ఉన్నట్లు సమాచారం.
సభలో తాము మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించడం లేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్న నేపధ్యంలో తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. భారత్-చైనా ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ నరవణె అముద్రిత పుస్తకంలోని అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ఎంపీలు నిరసనలకు దిగి సస్పెన్షన్కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తీరుపై ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి పూనుకుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని మోడి, స్పీకర్ ఓం బిర్లాలపై ఎఐ వీడియోలు ప్రచారం చేశారంటూ లోక్సభ సచివాలయం ఇప్పుడు 9 మంది కాంగ్రెస్ నేతలకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చెయ్యడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పార్లమెంట్ ఆవరణలోకి వీధి కుక్కను తీసుకువచ్చినందుకు ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరికి కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.