* ఎంపీల ప్రొఫైల్స్ చూసి కొండా ఆశ్చర్యం
* రాహుల్ గాంధీ వృత్తి 'స్ట్రాటజీ కన్సల్టెంట్'...
* పార్లమెంట్ కెఫెటేరియాలో ఎంపి రఘునందన్ తో సరదా చర్చ...
ఢిల్లీ :
పార్లమెంట్ సభ్యుల వ్యక్తిగత, వృత్తి వివరాలతో కూడిన Who's Who పుస్తకంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రొఫెషన్ చూసి ఆశ్చర్యపోయినట్లు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. పార్లమెంట్ సమావేశాల విరామ సమయంలో తోటి ఎంపీలతో కలిసి ఈ పుస్తకాన్ని పరిశీలిస్తూ ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ కాసేపు వాయిదా పడటంతో.. ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులు పార్లమెంట్ కెఫెటేరియాలో టీ తాగేందుకు వెళ్లారు. ఆ సమయంలో లోక్సభ సచివాలయం తమకు కాంప్లిమెంటరీగా అందించిన Who's Who పుస్తకాన్ని ఎంపీ కొండా తిరిగేశారు. అందులో ఎంపీల విద్యా అర్హతలు, వృత్తి, గత నేపథ్యం, వారి ఆసక్తుల వివరాలు పొందుపరిచారు.
ఆ పుస్తకంలో తన వివరాలను చూసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తన వృత్తి 'ఇంజనీర్' అని సరిగ్గా పేర్కొనడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సహచర ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరుల ప్రొఫైల్ చూశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రొఫైల్ను చూసిన ఆయన కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. రాహుల్ గాంధీ తన వృత్తిని 'స్ట్రాటజీ కన్సల్టెంట్'గా బుక్లో పొందుపరిచారు. రాహుల్ రాజకీయాల్లోకి రాకముందు విదేశాల్లో మేనేజ్మెంట్ కన్సల్టింగ్ రంగంలో పనిచేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన వృత్తిని లోక్సభ రికార్డుల్లోనూ 'స్ట్రాటజీ కన్సల్టెంట్'గా కొనసాగించినట్లు తెలిసింది.

'పార్లమెంట్ డిజిటల్ లైబ్రరీల ఉన్న 'Who's Who' పుస్తకంలో కొంత మంది ఎంపీల వివరాలు చూసిన, వాళ్ళ చదువు, వృత్తి, ఇష్టాలు ఏమున్నాయో తెలుసుకుందామని చూష్ణ. నా ప్రొఫెషన్ 'ఇంజనీర్' అని కరెక్ట్ గానే ఉంది. రాహుల్ గాంధీ వృత్తి 'స్ట్రాటజీ కన్సల్టెంట్' గా ఉండడం చూసి పరేషాన్ ఐన' అని ఎంపీ కొండా ట్వీట్ చేశారు. కాగా, లోక్సభ ప్రచురించే ఈ పుస్తకం ఎంపీలు స్వయంగా అందించిన సమాచారం ఆధారంగానే రూపొందించబడుతుందని కొండా తెలిపారు. వారి రాజకీయ ప్రస్థానానికి ముందు ఉన్న వృత్తిని లేదా వారు దేనిలో నిపుణులో ఆ వివరాలను ఇందులో పొందుపరుస్తారని వెల్లడించారు.