○ రాష్ట్ర ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకు ఈనెల 24 వరకు గడువు పెంపు...
ASTRANEWS :
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఇంటింటి సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24 వరకు పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల అధికారికి రాష్ట్రంలోని వైసీపీ, సిపిఐ సిపిఎంలు గడుపు పొడగించాలని విజ్ఞప్తి చేయగా, ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో సర్వే ఇంకా పూర్తిగా పూర్తికాకపోవడం, రాజకీయ పార్టీల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓటర్లకు ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడం, కొన్ని చోట్ల ఓటర్లు ఫారాలు పూర్తి చేసి సిద్ధంగా ఉంచినా, బూత్ లెవెల్ అధికారులు (BLOS) వాటిని తిరిగి సేకరించడంలో ఆలస్యం చేయడం, ఓటర్ల నుంచి సేకరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే (డిజిటలైజేషన్) ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం, ఈ సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందుల వల్ల అర్హులైన అనేకమంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే స్పందించి ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. పార్టీలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఈసీ, ఓటర్ల నమోదు, సవరణలు సజావుగా సాగేందుకు వీలుగా మరో పది రోజుల పాటు సమయాన్నీ పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఓటర్లు జులై 24వ తేదీ లోపు తమ వివరాల సవరణలు, కొత్త నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అభ్యంతరాలు మరియు క్లెయిమ్లను ఆగస్టు 30 వరకు స్వీకరించి, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న విడుదల చేయనున్నారు.