* నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే…
* దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా ?
* శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తే...
* మీ ఎమ్మెల్యే, అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేస్తారా ?
* సిఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ ట్విట్ చేసిన వైఎస్ జగన్ ...
అమరావతి :
ఎపి మెగా డిఎస్సీలో అక్రమాలపై విచారణ చేపట్టడంతో పాటు మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన రెలే నిరాహార దీక్షలపై జరుగుతున్న దాడులపై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. Nara Chandrababu Naidu గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించారు.

#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగి పడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. అంటూ విజయవాడలో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ చేసిన దాడికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.
నారా లోకేష్ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు ? DSC–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి.
* నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి.
* ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
* మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి.
చంద్రబాబు గారూ… మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు... మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు...నిరసనకారులను అరెస్టు చేయవచ్చు...
కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు... నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ Gen Z గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు.