EX CM Siddaramaiah :
కర్ణాటకలో నూతన సిఎంగా DK శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ మాజీ సిఎం సిద్దరామయ్యను పార్టీలో అత్యున్నత పదవిలో నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సీడబ్ల్యూసీలోకి ఆయనను తీసుకురావడం ద్వారా జాతీయ స్థాయిలో సముచిత స్థానం కల్పించినట్లయింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న ఇద్దరు అగ్రనేతల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా, ఇటు రాష్ట్ర బాధ్యతలను అటు జాతీయ స్థాయి ప్రాధాన్యతలను బ్యాలెన్స్ చేయడానికే హైకమాండ్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు బెంగళూరులో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు ఘనంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కనీసం 12 మంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారీ ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తొలి విడత మంత్రివర్గ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ నేతృత్వంలో కొలువుదీరనున్న ఈ కొత్త ప్రభుత్వం, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపైనే తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు దేశంలోని పలువురు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.