విద్య, వైద్యం.. పీపీపీ పేరుతో పేదలకు దూరం... !
పీపీపీ మోడల్లో 61 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు!
మెడికల్ కాలేజీలే వ్యవహారం బెడిసినా ...
నియోజకవర్గ ఆసుపత్రులు కూడా పీపీపీ మోడల్ లో అప్పగించే ప్రయత్నం ..
కార్పొరేట్ వైద్యం పేరుతో పీపీపీ మోడల్ అమలుకు ప్రభుత్వ నిర్ణయం ...
వైసీపీ స్పందన కోసం ఎదురుచూపులు ...?
అమరావతి :
రాష్ర్టంలో ఇప్పటికే నిర్మించిన, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ లోకి తీసుకురావాలనుకున్న ప్రభుత్వం ... ఇప్పుడు నియోజకవర్గ ఆసుపత్రులను కూడా పీపీపీ మోడల్ లోకి తీసుకురానుంది. ఇందుకోసం కార్పోరేట్ స్థాయి వైద్యం పేరుతో ఈ అసుపత్రులను దశల వారీగా పీపీపీ మోడల్ ను అమలు చెయ్యాలని నిశ్చయించింది. పీపీపీ మోడల్లో భాగంగా 61 నియోజకవర్గాల్లో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మెడికల్ కాలేజీల విషయంలో వాటిని కార్పొరేట్ల చేతిలో అప్పగించే కుట్ర అంటూ వైసీపీ, వామపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో పాటు ఏకంగా మాజీ సిఎం వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే వాటిని తిరిగి తీసుకుంటామంటూ హెచ్చరించడంతో వాటికి టెండర్లు వేసేందుకు కూడా ఎవ్వరు ముందుకు రాలేదు. ప్రజల్లోను తీవ్ర వ్యతిరేకతే వ్యక్తమైంది. విద్య, వైద్యం కానీ గతన్ని కూటమి ప్రభుత్వం మరచిందొ లేక మరో ప్రయత్నం చేద్దామనుకుందో తెలీదు కానీ ... ఇప్పుడు గంప గుత్తగా వైద్య రంగాన్నే కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు సిద్దమైంది.
కానీ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రతి ప్రాణం విలువైనదేనని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో నొక్కిచెప్పారు. రాష్ట్ర ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ముఖ్యంగా 50 పడకల కంటే తక్కువ వైద్య సౌకర్యాలు ఉన్న నియోజకవర్గాలలో ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందిస్తోందన్నారు.
మెుదటి దశలో 61 :
మొదటి దశలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP) పద్ధతిలో 61 నియోజకవర్గాలలో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించింది ప్రభుత్వం. అవసరమైన చోట, క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సెకండరీ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడానికి దాదాపు 40 ప్రతిపాదనలు వచ్చాయని, వీటిలో విజయవాడ శివార్లలోని గన్నవరం, నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు ఉన్నాయని పేర్కొంది. మంగళగిరి, పిఠాపురంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను 100 పడకలకు అప్గ్రేడ్ చేయడానికి, చింతూరులోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల సౌకర్యంగా విస్తరించడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

పనులు వేగవంతం :
2014-19లో టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 81 ఆసుపత్రులలో పడకల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించినప్పటికీ, గత ప్రభుత్వం 2019-2024 మధ్య నిర్మాణ పనులను పూర్తి చేయలేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆళ్లగడ్డలోని 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్గ్రేడ్ చేయడంతో సహా పెండింగ్లో ఉన్న ఈ పనులను సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు వేగవంతం చేసిందన్నారు. నాబార్డ్ మద్దతుతో రూ.1,518.80 కోట్ల వ్యయంతో 188 ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సిలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇందులో రూ.111 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, 60 ఆసుపత్రి భవనాలు ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించింది.
జిల్లాకో క్రిటికల్ కేర్ బ్లాక్
ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 24 క్రిటికల్ కేర్ బ్లాక్ భవనాలు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 14 పూర్తి దశల్లో ఉండగా, చిత్తూరు, అమలాపురం, అన్నమయ్య, పోలవరం జిల్లాల్లో అదనపు క్రిటికల్ కేర్ బ్లాక్ల కోసం రాష్ట్రం కేంద్ర అనుమతిని కోరింది. ప్రతి 100 కి.మీ. రహదారులకు ఒక ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలనే ఇటీవలి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనను సత్యకుమార్ ప్రస్తావిస్తూ, ప్రమాద సంబంధిత మరణాలను నివారించడానికి తగిన ప్రదేశాలలో ట్రామా సెంటర్లను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
వైసీపీ స్పందన కోసం ఎదురుచూపులు :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించింది. కానీ ప్రతిపక్ష వైసీపీ మాత్రం తాము అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వమే తీసుకుంటుందని, టెండర్లలో ఎవ్వరు పాల్గొనవద్దని హెచ్చరికలతో టెండర్లు వేసేందుకు ఎవ్వరు ముందుకు రాలేదు. దీంతో రాష్ర్టంలో సంచలనంగా మారగా, ఇప్పుడు ప్రభుత్వం మరో మారు నియోజకవర్గ ఆసుపత్రులు కూడా పీపీపీ మోడల్ లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది. మరి ఇది వరకు మెడికల్ కాలేజీల విషయంలో స్పందించినట్లు వైసీపీ స్పందిస్తూ లేదా అన్నదాని కోసం అందరు అసక్తిగా ఎదురుచూస్తున్నారు.