Ambati Rambabu :
ఎపీలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య సాగుతున్న పోరులో మరో ట్విస్ట్. కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్ ఇచ్చాక అందులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ గుర్తుచేస్తూ అంబటిపై పెట్టిన కేసులను ప్రస్తావించింది. కల్తీ జరిగింది నిజమేగా అంటూ టీడీపీ జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై ఫ్లెక్సీలు పెట్టించింది. వాటిని తొలగించేందుకు వెళ్తున్న అంబటి రాంబాబాబును, టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, ఫ్రస్ట్రేషన్ లో ఆయన చంద్రబాబును తిట్టడం, ఆ తర్వాత ఆయన ఇంటిపైకి టీడీపీ శ్రేణులు వెళ్లి విధ్వంసం చేయడం జరిగిపోయాయి.
అంబటిపై 36 కేసులా ?
ఈ ఘటనల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో వారు కూడా వెంటనే కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. ఇలా రాష్ట్రంలో అంబటికి వ్యతిరేకంగా 36 కేసులు నమోదు చేశారు. ఇందులో గుంటూరులోని నల్లపాడు పీఎస్ లో నమోదు చేసిన కేసులో అంబటి అరెస్టు అయి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బయటికి వచ్చినా మిగతా కేసుల్లో అరెస్టుకు పోలీసులు సిద్దమవుతున్నట్లు వినికిడి.

అంబటి కేసులపై వైసీపీ ట్వీట్
ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కూడా హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ దాడిని తీవ్రంగా తప్పుబడుతున్న వైసీపీ.. గత కొన్ని రోజులుగా విమర్శలకు దిగుతోంది. ఇప్పుడు అంబటిపై 36కేసులు నమోదైనట్లు సోషల్ మీడియాలో టీడీపీ చక్కర్లు కొట్టిస్తున్న లిస్ట్ ను తీసుకుని వైసీపీ తమ అధికారిక ఎక్స్ లోనే పోస్టు చేసింది. కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పగబట్టి కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో అంబటి రాంబాబు గారిపై రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 36 కేసులు నమోదు, కాపు నేతపై మరీ ఇంత ఓర్వలేనితనమా అంటూ వ్యాఖ్యలు చేసింది.